మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని శుక్రవారం ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతమైంది. ఈ దీక్షలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
ఖమ్మం, మార్చి 10: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో శుక్రవారం చేపట్టిన దీక్షకు ఎంపీలు నామా, వద్దిరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, పరిపాలనలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని ఆకాంక్షించారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరి కాదని అన్నారు. సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడుతుండడం శోచనీయమన్నారు.
మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీకి అవకాశం ఇచ్చి ఎనిమిదెండ్లు దాటిపోయిందని మండిపడ్డారు. బిల్లు మాత్రం ఇంకా లోక్సభ ముందుకు రాలేదని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని స్పష్టం చేశారు.