భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ వాసులను చలి గడగడ వణికిస్తున్నది. వారంక్రితం నుంచి రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలను తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాత్రివేళ చలికి జనం గజగజలాడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు చలి ధాటికి తాళలేకపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటినా మంచు వీడడం లేదు. ఈక్రమంలో చలి నుంచి రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. – భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను చలి పులి వణికిస్తున్నది. 4, 5, 6 తేదీల్లో తుపాను ప్రభావంతో జిల్లాను ముసురు కమ్ముకోగా ఆ ప్రభావం తర్వాత కూడా కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ప్రస్తుతం స్వెట్టర్లు వేసుకుంటే తప్ప బయటకు రాలేని వాతవరణం ఉన్నది. వాతావరణంలో మార్పులు రావడంతో కొందరు జ్వరం, జలుబుతో సతమతమవుతున్నారు. వాహనదారులు తెల్లవారిన తర్వాత కూడా లైట్లు వేసుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పొద్దున్నే పనికి వెళ్లే కూలీలు, వ్యాపారులు చలి ధాటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల చివరి వరకు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
వృద్ధులు, చిన్నారులు చలి, పొగ మంచులో బయటకు వెళ్లిద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. చలి చెవులు, ముక్కు, చర్మం, పెదవులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ మాయిశ్చరైజర్లు వాడాలని వైద్యులు చెప్తున్నారు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగాలంటున్నారు. ఉదయం పూట కనీసం 40 నిమిషాలు వ్యాయామం చేస్తే బిగుసుకున్న కండరాలు ఉత్తేజితమవుతాయంటున్నారు. మూడు పూటలా వేడి వేడి ఆహార పదార్థాలనే తినాలంటున్నారు. వేసవి, వానకాలంలో కంటే ఈ చలికాలంలో తీసుకునే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలంటున్నారు. చల్లటి పదార్థాలు, కూల్డ్రింక్స్, తీపి పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే టమాటా, క్యాప్సికమ్, ఆకుకూరలతో పాటు తాజా పండ్లు ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలంటున్నారు.