తిరుమలాయపాలెం, మే 20: నాటి ఆంధ్రుల పాలనలో గొంతెండిన పల్లె ప్రజలకు నేడు స్వరాష్ట్రంలో దూపదీరా స్వచ్ఛమైన జలాలు అందుతున్నాయి. ఒకనాడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బావుల దగ్గర నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకున్న ప్రజలకు నేడు ఆ బాధలు తప్పాయి. ఇప్పుడు తమ ఇళ్లలో ట్యాప్ తిప్పగానే స్వచ్ఛమైన నీళ్లు వస్తున్నాయి. ఫ్లోరైడ్ రహిత శుద్ధ జలాలు ఇంటింటికీ అందుతున్నాయి.
వరంలా మిషన్ భగీరథ..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం మండల ప్రజలకు వరంలా మారింది. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న దాహార్తి సమస్యను తీర్చింది. ఇంటింటా ఏర్పాటు చేసిన నల్లాల ద్వారా పుష్కలంగా తాగునీటిని సరఫరా చేస్తోంది. ఒకనాడు వేసవి వస్తే తాగునీటి కోసం తాము పడే బాధలు అన్నీ ఇన్నీ కావని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో ఆ సమస్యలన్నీ తొలగిపోయాయని మండలంలోని మహిళలు చెబుతుండడం మిషన్ భగీరథ పథకం తెచ్చిన విప్లవాత్మక మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఆనాడు జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉండేది. వర్షాభావ పరిస్థితుల వల్ల బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటేవి. అలాంటి సమయంలో తాగునీటి కోసం మండల ప్రజలు అల్లాడిపోయేవారు. ఒక్కోసారి స్వచ్ఛంద సంస్థల వారు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితులు ఉండేవి. తిరుమలాయపాలెం మండలంలో ఏటా నవంబర్ నుంచే ప్రజలకు నీటి తిప్పలు తప్పేవికావు. వేసవి వచ్చిందంటే ఆ తిప్పలు మరింత జటిలమయ్యేవి. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంతో మండలంలో తాగునీటి సమస్యలన్నీ తొలగిపోయాయి. ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా సమసిపోయింది.
2018లో వాటర్గ్రిడ్..
నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు తాగునీటి పథకాలను పూర్తిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి.. పాలేరు రిజర్వాయర్ నుంచి తాగునీరు సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చింది. మిషన్ భగీరధ పథకం ద్వారా తిరుమలాయపాలెం మండలంలోని తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 2018లో మండలంలోని మాదిరిపురంలో వాటర్గ్రిడ్ నిర్మించారు. పాలేరు రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా ప్రతిరోజు 170 మిలియన్ లీటర్ల నీటిని మాదిరిపురం గ్రిడ్కు తరలిస్తారు. అక్కడ నీటిని శుద్ధిచేసి మండలంలోని దమ్మాయిగూడెం, బచ్చోడుతండా, బంధంపల్లిలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు తరలిస్తారు. ఆయా ట్యాంకుల ద్వారా పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన 16,000 ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ ప్రతి ఇంటికీ 400 లీటర్లకు తగ్గకుండా తాగునీటి అందిస్తున్నారు. ఇందుకు గాను గ్రామాల్లో 10,000 లీటర్ల నుంచి రెండు లక్షల లీటర్ల సామర్థ్యంతో 103 ట్యాంకులను నిర్మించారు. వీటి ద్వారా గ్రామాల్లో తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో సైతం మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు ఏఈ వసంత్కుమార్ తెలిపారు. ప్రస్తుతం వేసవిలోనూ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేవని చెప్పారు.
తాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలిగాయి
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా తిరుమలాయపాలెం మండలంలోని ప్రజల తాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి. ప్రస్తుతం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుద్ధిచేసిన తాగునీరు సరఫరా అవుతోంది. వేసవిలోనూ నీళ్లకు ఇబ్బందులు లేవు. ప్రజలకు తాగునీటి తిప్పలు తొలగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మండల ప్రజలు రుణపడి ఉంటారు.
-ఇస్లావత్ అచ్చమ్మ, సర్పంచ్, ఇస్లావత్తండా