ఖమ్మం, ఏప్రిల్ 13: చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. వారికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాద క్షతగాత్రులను గురువారం వారు పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉందన్నారు. ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇన్ని రోజులూ తమతో ఉన్న పార్టీ కుటుంబ సభ్యులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధను కలిగిస్తోందని అన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎలాగైనా కాపాడుకునేందుకు వైద్యులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన, నాణ్యమై న వైద్యం అందేలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని అన్నా రు. బాధితులంతా త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని భరోసా కల్పిస్తున్నామన్నారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలోని చీమలపాడులో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఈ ఘటనతోపాటు తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ నెల 19న తన పుట్టినరోజు వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున తన జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కోరారు. చీమలపాడు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానన్నారు.