ఖమ్మం : గత పాలకులు ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదు. బడుగుల నోట్లో మట్టి కొట్టాలని రాజకీయ వలస పక్షులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్ ను గిరిజన శాఖ మంత్రి సత్వతి రాథోడ్తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
అనంతరం ముఖ్యమంత్రి గిరివికాస పథకం కింద జిల్లా వ్యాప్తంగా మంజూరైన 243 మందికి బోర్ వెల్స్, ట్యూబ్ వెల్స్- 61 ఆయా లబ్ధఙదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ను రఘునాథపాలెంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అలాగే నీట్ కోచింగ్ కూడా ఇక్కడే ఇస్తామని స్పష్టం చేశారు. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చారు. త్వరలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తామన్నారు. కేటీఆర్ దావోస్ పర్యటనతో తొలిరోజే రాష్ట్రానికి రూ. 1000 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.