ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 13 : జిల్లాలోని ఖమ్మంరూరల్ మండలంలో ఏటేటా అనేక విద్యాసంస్థలు అందుబాటులోకి వస్తుండడంతో పిల్లలకు మెరుగైన విద్యతోపాటు నిరుద్యోగులకు ఉపాధి సైతం దొరుకుతున్నది. ప్రస్తుతం ఖమ్మంరూరల్ మండలంలో టీఎస్డబ్ల్యూఆర్ఎస్కు చెందిన డిగ్రీ కళాశాల, కేజీబీవీ, కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ కాలేజీలు, మూడు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు, మూడు బీఈడీ కళాశాలలు రెండు పాలిటెక్నిక్ కళాశాలలు, 19 ప్రైవేట్ పాఠశాలలు, 63 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. సాధారణంగా ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో 10 నుంచి 15 మంది వరకు స్టాఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మండలంలో 19 పాఠశాలలు అందుబాటులో ఉండగా వాటిలో సుమారు 250 మంది వరకు ప్రైవేట్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఇతర సాంకేతిక కళాశాలల్లో సైతం అనేకమందికి ఉపాధి దొరికింది. గతంలో పాలేరు నియోజకవర్గంలోనే ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన ర్యాంకు వచ్చినప్పటికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర జిల్లాలకు వెళ్లి విద్యను అభ్యసించేవారు. అయితే ప్రస్తుతం బీఈడీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ విద్యను ఇక్కడే అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు మంచి అవకాశం ఏర్పడింది. తెలంగాణ సర్కార్ తెచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా పేదింటి విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందుబాటులోకి వచ్చింది.
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ప్రత్యేక కృషి, సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల పాలేరు నియోజకవర్గానికి తలమానికం కాబోతున్నాయి. సుమారు రూ.350 కోట్లతో కొద్దిరోజల్లోనే ఈ రెండు కళాశాలల శాశ్వత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచే సదరు కళాశాలలకు అడ్మిషన్లు పూర్తి చేసుకొని తరగతులు ప్రారంభంకాబోతుండడం విశేషం. ఇప్పటికే జేఎన్టీయూహెచ్ కళాశాల నిర్వహణ ప్రారంభమైంది. తాత్కాలికంగా మండలంలోని బారుగూడెం పరిధిలోని మహ్మదీయ కళాశాలలో కొన్ని గ్రూపులకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. కొద్దిరోజుల్లో నర్సింగ్ విద్యార్థుల కౌన్సిలింగ్ అనంతరం తాత్కాలింగా కోదాడ క్రాస్రోడ్లో గల వైటీసీ భవనంలో తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలంలోని మద్దులపల్లి గ్రామంలో నర్సింగ్ కళాశాలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. మండలంలోని మద్దులపల్లి గ్రామం పరిధిలోని వైటీసీ భవనం పరిసర ప్రాంతంలో 6 ఎకరాల సువిశాల మైదానంలో కళాశాల ఏర్పాటుకానున్నది. నర్సింగ్ కళాశాల పక్కన నూతన జేఎన్టీయూహెచ్ కళాశాల సైతం నిర్మాణంకానున్నది. మధ్యాహ్నం 2:30 గంటలకు మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే సభలో మంత్రి నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. మంత్రి హరీశ్రావుతోపాటు జిల్లా మంత్రి అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొననున్నారు. పాలేరు నియోజకవర్గం గతంలో ఎప్పుడూ లేనివిధంగా అనేక విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎమ్మెల్యే కందాళను నియోజకవర్గ ప్రజలు ఘనంగా సత్కరించేందుకు సిద్ధమయ్యారు.
పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదవడమే నా ప్రధాన లక్ష్యం. సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతో పాలేరుకు అనేక విద్యాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాల ప్రారంభంకానున్నది. కొద్దిరోజుల్లో కూసుమంచి మండలంలో మత్స్య కళాశాల సైతం నిర్మాణం కాబోతున్నది. పేదింటి విద్యార్థులకు కందాళ ట్రస్టు ద్వారా ఆర్థికసాయాన్ని అందజేస్తున్నాం. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నర్సింగ్ కళాశాల సైతం మంజూరుకావడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు. సీఎం కేసీఆర్కు పాలేరు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– కందాళ ఉపేందర్రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే