ఖమ్మం సిటీ, జనవరి 30 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న నిర్వహించనున్న మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం నూతన కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జాబ్మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో చేపట్టనున్న జాబ్మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. 65కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. 5వేలకు పైగా ఉద్యోగాలకు నియామకం చేసుకుంటారని, నిరుద్యోగ యువతకు ఇది సువర్ణావకాశమని కలెక్టర్ పేర్కొన్నారు.
18-35 ఏళ్ల వయసు కలిగి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, అన్ని విభాగాల డిప్లొమా, బీఫార్మసీ, అన్ని విభాగాల ఎంఫార్మా, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంసీఎస్, బీఈ, బీటెక్, ఎంటెక్ విభాగాల్లో ఉత్తీర్ణత కలిగిన వారు జాబ్మేళాలో పాల్గొనాలన్నారు. అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, హెల్ప్లైన్ నెంబర్లు 88867 11991, 96423 33668 ద్వారా సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో సునీల్రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కే.శ్రీరాం, అదనపు పౌరసంబంధాల అధికారి వీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.