రఘునాథపాలెం/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం కమాన్బజార్, జనవరి 18: ఖమ్మం సమీపాన వీ వెంకటాయపాలెం వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజ లు భారీగా తరలివచ్చారు. నగరానికి 10 కిలోమీటర్ల మేర చుట్టుపక్కల ఉన్న ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఏ వాహనాన్ని చూసినా జనంతో నిండిపోయాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నప్పటికీ భారీగా తరలివచ్చిన జనం ఉన్న వాహనాలను అదుపు చేయడం ఎంతో కష్టసాధ్యమైంది. దీంతో వాహనాలన్నింటినీ రహదారులకు పక్కన ఉన్న చిన్నచిన్న దారులకు మళ్లించి జనాన్ని సభా ప్రాంగణానికి తరలించారు. దీంతో వైరా ప్రధాన రహదారి జన జాతరను తలపించింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు తరలివచ్చారు. ముఖ్యంగా తండాలకు చెందిన గిరిజనులు తమ సంప్రదాయ దుస్తులతో పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా వాహనాలపై ఉంటూ ‘జై కేసీఆర్.. జై తెలంగాణ.. దేశ్ కీ నేత కేసీఆర్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వచ్చారు. బహిరంగ సభతో వాహనాలను గులాబీ జెండాలతో అలంకరించారు.