‘మామిళ్లు పూసినాయి.. మారాకు తొడిగినాయి.. సిలకాలు చేరినాయి’ అని అద్భుతమైన గేయం రాశాడు ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. ఆ గేయానికి దృశ్యం రూపమైనట్లు భద్రాద్రి జిల్లాలోని మామిడి తోటల్లోని చెట్లకు పూతలు పూశాయి. గడిచిన మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా తోటల్లో పూత కనిపిస్తున్నది. దీంతో రైతులు అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. సాధారణంగా పూత అధికంగా కనిపించినప్పటికీ పిందె పట్టే సమయంలో తెగుళ్ల బెడద ఉంటుంది. పూత, పిందె దశలోనే నేల రాలే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తమై పూత దశ నుంచే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
అశ్వారావుపేట/ చండ్రుగొండ, ఫిబ్రవరి 5: భద్రాద్రి జిల్లాలో మామిడి తోటలు సీజన్కు ముందే విరబూశాయి. గడిచిన మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా తోటల్లో పూత కనిపిస్తున్నది. దీంతో రైతులు అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. సాధారణంగా పూత అధికంగా కనిపించినప్పటికీ పిందె పట్టే సమయంలో తెగుళ్ల బెడద ఉంటుంది. పూత, పిందె నేల రాలే అవకాశం ఉంది. రైతులు పూత దశ నుంచే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
జిల్లావ్యాప్తంగా 10,995 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఉద్యాన తోటల పెంపకంలో రైతులు ప్రధానంగా మామిడి తోటలపై ఆసక్తి చూపిస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తోటలోల ఎకరాకు 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అకాల వర్షాలు, చీడపీడల కారణంగా మూడేళ్ల నుంచి ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. దీంతో ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఒక పూల కొమ్మలో సుమారు 2 నుంచి 3 వేల పుష్పాలు ఉంటాయి. ఈ పూతను కాపాడుకోకపోతే 99 శాతం రాలిపోతుంది. ఒక పూరెమ్మనుంచి 5 నుంచి 6 పిందెలు కడతాయి. వీటిలో ఒకటి రెండుమ మాత్రమే పిందెలు కడతాయి. మామిడి తోటలో పూత రాలడం సహజం. మగ పుష్పాలు, ఫలదీకరణం చెందని పుష్పాలు రాలిపోతాయి. అధిక ఉష్ణోగ్రత, బూడిద తెగులు, తేనె మంచు పురుగు, నీటి ఎద్దడి, అధిక తేమ, హర్మోన్ల లోపం వల్ల పూత, పిందెలు రాలిపోతాయి.
తోటల్లో ఆకులపై బూడిద మచ్చలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యగా నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు, లేదా సాప్ 2 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకులపై నల్ల మచ్చలు ఉంటే అవి పూల కొమ్మలకు సోకి పూత రాలిపోతుంది. నివారణకు ముందుగా లీటర్ నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
– జి.మరియన్న, జిల్లా ఉద్యానశాఖ అధికారి, కొత్తగూడెం
మామిడి తోటల్లో పూత, పిందె రాలకుండా తెగుళ్లను గుర్తించి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించొచ్చు. రైతులు శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారుల సూచనలు పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉంది. మాజమాన్య పద్ధతులు పాటించడం రైతుల ప్రధాన బాధ్యత.
– డాక్టర్ ఐవీఎస్ రెడ్డి, అసోషియేట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట