మామిళ్లగూడెం, జనవరి 21 : ఖమ్మాన్ని అవినీతిరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రతి ఒకరూ తమవంతు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు అవినీతి, వరకట్నం, బ్రూణ హత్యల నివారణపై జిల్లా కలెక్టర్తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒకరూ నీతి నిజాయితీతో ఉంటే సమాజం కూడా అదే రకమైన వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని, మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ తమ పిల్లవానికి కట్నం తీసుకోమని ప్రతిన పూనాలన్నారు. బ్రూణ హత్య మహా పాపమని, అది నేరమని అన్నారు.
ఆడపిలని కాపాడుకోవాలన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఆశ మానవ స్వభావమని అదే అవినీతికి మనిషిని ప్రేరేపిస్తుందన్నారు. మనిషి వ్యక్తిత్వం వెలకట్టలేనిదని అవినీతికి పాల్పడి దానికి విలువ నిర్ణయించవద్దని సూచించారు.
మనిషికి గౌరవప్రదమైన జీవితం చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, న్యాయమూర్తులు ఎన్. సంతోష్కుమార్, ఎం.ఏ. జావిద్ పాషా, ఆశారాణి, ఆశాలత, మౌనిక, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్, ఐడీవోసీకి వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి, ఐడీవోసీ ప్రత్యేకతలు వివరించారు. మూడు ఫ్లోర్లలో ఉన్న అధికారులు, సిబ్బంది కార్యాలయాలను చూపించారు. ఐడీవోసీలో 40శాఖల కార్యాలయాలు నిర్వహణలో ఉన్నట్లు, 1000మంది సిబ్బంది పని చేస్తున్నట్లు కలెక్టర్ ప్రధాన న్యాయమూర్తికి వివరించారు.