మధిరటౌన్, జనవరి 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మధిర పట్టణలో అభివృద్ధి జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు అన్నారు. ఆదివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని ‘గుడ్ మార్నింగ్ మధిర’ కార్యక్రమంలో భాగంగా ఆయన వార్డుల్లో పర్యటించారు. అంబారుపేటలో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతతో కలిసి మార్నింగ్వాక్ చేస్తూ వార్డు మొత్తం కలియ తిరిగారు. ఆ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలతో ఆయన నేరుగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిర మున్సిపల్ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలంతా మద్దతుగా ఉండాలని కోరారు. ప్రజలందరి సహకారంతో మధిర పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని గుడ్మార్నింగ్ మధిర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అంబారుపేటలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, పట్టణంలో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిను సుందరీకరణతో తీర్చిదిద్దామన్నారు. ఎన్నికల సమయం రాగానే వచ్చి మాయమాటలు చెప్పే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి సీఎం కేసీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.