భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 11(నమస్తే తెలంగాణ) : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సాహిత్యానిదే కీలకపాత్ర అని, ఎందరో కవులు, కళాకారులు తమ గళం కలిపారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సాహిత్య వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కవులు, కళాకారులకు పుట్టినిల్లు కొత్తగూడెం అని, పాల్వంచ నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. పాల్వంచ ఉద్యమాల గడ్డ అని, ఎందరో మహనీయులు త్యాగం చేశారని, వారి త్యాగ నిరతిని ఆయన కొనియాడారు. సాహిత్యంపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉన్నదని, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని రానున్న తరాల వారికి తెలియజేసేందుకు సాహిత్య దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు.
కవులు, కళాకారులు రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో సాహిత్యం ఉద్యమంలా వెలిగిందని అన్నారు. ప్రజలను చైతన్యపర్చే విధంగా ఆనాటి నుంచి నేటి వరకు సుద్దాల అశోక్తేజ నుంచి కాళోజీ వరకు రచించిన కవితలు, గేయాలు ప్రజలను చైతన్యం, జాగృత పర్చాయన్నారు. కవుల కలాల నుంచి జాలువారిన సాహిత్యం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో ఉపయోగపడిందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. సాహిత్య వేడుకలకు చిన్నారులు సైతం రావడం చాలా సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, డీపీఆర్వో శ్రీనివాస్, మహిళా సంక్షేమ అధికారి సబిత, సీపీవో శ్రీనివాసరావు, విద్యాశాఖ కో ఆర్డినేటర్ సైదులు, సీనియర్ కవులు దిలావర్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.