తిరుమలాయపాలెం/ కూసుమంచి రూరల్, డిసెంబర్ 29: మండలంలోని ఇస్లావత్ తండా భక్తరామదాస్ ఎత్తిపోతల పథకం నుంచి గురువారం కృష్ణా జలాలు విడుదలయ్యాయి. ఈ నీటితో కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని శ్రీరాంసాగర్ కాలువల ద్వారా జలాలు 79 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. చెరువులు నిండే అవకాశం ఉన్నది. దీంతో యాసంగిలో పంటల సాగుకు సాగునీటి ఇబ్బందులు తప్పాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి చొరవ తీసుకుని నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి జలాలు తొందరగా విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. రైతులు వరి సాగుకు సమాయత్తమవుతున్నారు. బుధవారమే నీటిని విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఒకరోజు ఆలస్యమైందని తెలిసింది. ఎత్తిపోతల ద్వారా పదిరోజుల పాటు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ రమేశ్రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలనలో యాసంగిలో వరి సాగు చేసేవారమే కాదని, తెలంగాణ వచ్చిన తర్వాతే ఏడాదిలో రెండు పంటలూ వరి సాగు చేయడం సాధ్యమైందని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది. భక్తరామదాస్ ఎత్తిపోతల పథకంతో పాలేరు బెల్టు కోనసీమను తలపిస్తున్నదని అభిప్రాయపడుతున్నది.
భక్తదరామదాస్ ఎత్తిపోతల పథకం కరువు ప్రాంత రైతుల పాలిట కల్పతరువుగా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాతే పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. మేం ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. యాసంగి సాగుకు ముందుగానే జలాలు విడుదల కావడం భరోసానిచ్చింది.
– వంచర్ల సత్యనారాయణరెడ్డి, రైతు, బీరోలు