ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని సప్తపది కల్యాణ మండపంలో ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో 130కిపైగా ప్రజా సంఘాల సభ్యులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలను ప్రగతి పథంలో నడిపించే విధంగా మున్ముందు పనిచేస్తానని ప్రకటించారు. ప్రజలతో మమేకమై వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు శ్రమిస్తానన్నారు. తొలుత నగరంలోని గాంధీచౌక్ నుంచి బైపాస్ రోడ్డు కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ జరిగింది. దీంతో నగరంలో కోలాహలం నెలకొన్నది.
ఖమ్మం, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇకముందు కూడా జిల్లా ప్రజలను మరింత ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తానని అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 130కిపైగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో పువ్వాడ అజయ్కుమార్కు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో ఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలతో మమేకవుతున్న తనకు సన్మానాలు పెద్దగా ఇష్టముండదని, కానీ ఇన్ని ప్రజా సంఘాలు రాజకీయాలకు ఆతీతంగా స్వచ్ఛందంగా ఆదరిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఎంతో చైతన్యం కలిగిన జిల్లా ప్రజలు ఒకే వేదిక మీదకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సన్మానంతో జిల్లా అభివృద్ధిపై తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెంచామన్నారు. జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేయించామని, జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయాన్ని దసరా తరువాత సీఎం కేసీఆర్తో ప్రాంభించుకుంటామని అన్నారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రజల ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఇతర సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఖమ్మం నగర, జిల్లా అభివృద్ధి కొనసాగాలంటే పువ్వాడ అజయ్కుమార్ను మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 130పైగా కుల, ప్రజా, సామాజిక, ఉద్యోగ, కార్మిక, కర్షక, వ్యాపార, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా ఖమ్మం గాంధీచౌక్ నుంచి బైపాస్ రోడ్డులోని సప్తపది ఫంక్షన్హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేశారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఆశీస్సులు అందించారు. ఆహ్వాన సంఘం ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కొప్పు నరేశ్కుమార్, కూరాకుల నాగభూషణం, పునుకొళ్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, డౌలే లక్ష్మిప్రసన్న, బోయపాటి వాసు, షేక్ అఫ్జల్హసన్, ఆర్వీఎస్ సాగర్, శ్రీనివాసరెడ్డి, సునీల్రెడ్డి, నాగబత్తిని రవి, కురువెళ్ల ప్రవీణ్, గొడవర్తి శ్రీనివాసరావు, పత్తిపాక రమేశ్, బొమ్మా రాజేశ్వరరావు, దేవర నాగరాజు, శ్రీను, శేషగిరి, అమరగాని వెంకన్న, కొరిపల్లి శ్రీనివాసరావు, బిచ్చాల తిరుమలరావు, చేకూరి ముక్తేశ్వరరావు, కొత్త వెంకటేశ్వరరావు, ఎర్నేని రామారావు, వెంకటేశ్వరరావు, గరికపాటి ఆంజనేయప్రసాద్, ఈశ్వరప్రగడ హరిబాబు, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఉప్పల వెంకటరమణ, రామకృష్ణారెడ్డి, మోతుకూరి మధు, కోడి లింగయ్య, ఆర్జేసీ కృష్ణ, పారా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, శీలంశెట్టి వీరభద్రం, దొరేపల్లి రవికుమార్, షేక్ షకీనా, పగడాల నాగరాజు, కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, మల్లెల రవీంద్రప్రసాద్, రాజేశ్, బానోత్ కిషన్నాయక్, మేదరమెట్ల స్వరూపారాణి, రుక్మారావు, నాగేశ్వరరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గజమాలతో మంత్రికి సత్కారం
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 18: నగరంలోని ప్రధాన వీధులు నగర ప్రజల హర్షధ్వానాలతో పులికించిపోయాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు నగర నలుమూలల నుంచి జనసందోహం తరలివచ్చింది. 300 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవోస్, వర్తక సంఘం, మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేర్వేరుగా గజమాలలతో సత్కరించారు. పండ్లు, పూలతో తయారు చేయించిన భారీ గజమాల ప్రత్యేక అకర్షణగా నిలిచింది.