కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 3: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్) పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జిల్లాల పరిధిలోని 187 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాస్తారన్నారు. 177 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 98,882మందికి హాల్టికెట్లు జారీ అయ్యాయన్నారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 200 మంది అధికారులను నియమించామన్నారు. ఇన్విజిలేటర్ సంతకం ఉన్న హాల్ టికెట్లను అభ్యర్థులు భద్రపర్చుకోవాలని సూచించారు. కరీంనగర్లోని 39 కేంద్రాల పరిధిలో 19,839 మంది, హైదరాబాద్-1లోని 19 కేం ద్రాల్లో 17,448 మంది, హైదరాబాద్ -2లోని 14 కేంద్రాల్లో 11,569 మంది, కొత్తగూడెంలోని 35 కేంద్రాల్లో 13,834 మంది, ఖమ్మంలోని 23 కేంద్రాల్లో 12,188 మంది, వరంగల్లోని 18 కేంద్రాల్లో 10,899 మంది, మంచిర్యాలలోని 28 కేం ద్రాల్లో 8,886 మంది, ఆదిలాబాద్ 11 కేంద్రాల్లో 4,219 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు.