అమీర్పేట, ఆగస్టు 25: ఒక్క ఫొటో ఎన్నో విషయాలు చెబుతుందని, పదికాలాలపాటు భద్రంగా ఉంటుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. డిజిటల్ రంగం రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఫొటోగ్రఫీ ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార,పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలైన ఫొటోగ్రాఫర్లకు అవార్డుల ప్రదానోత్సవం గురువారం అమీర్పేట గ్రీన్పార్క్ హోటల్లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి తలసానితోపాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎఫ్డీసీ చైర్మన్ కూర్మాచలం అనిల్కుమార్ హాజరయ్యారు. మొత్తం అయిదు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 96 మంది ప్రెస్ ఫొటోగ్రాఫర్లు మొత్తం 1200 ఎంట్రీలు పంపారు. ఈ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి తలసాని ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ వెయ్యి మాటలతో చెప్పే విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పగలిగే సామర్థ్యం ఒక్క చిత్రానికే ఉందన్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్కుమార్ మాట్లాడుతూ 8 ఏండ్ల తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ఈ ఫొటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలు చక్కగా ఆవిష్కరించాయన్నారు. ఈ 1200 చిత్రాలను నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఎఫ్డీసీ జేఎండీ కిశోర్బాబు, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డీడీలు వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, ఫొటో విభాగం ఏడీ బిమల్దేవ్ పాల్గొన్నారు.
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘నమస్తేతెలంగాణ’ దినపత్రిక ఫొటోగ్రాఫర్లు 6 అవార్డులు, తెలంగాణ టుడే ఫొటోగ్రాఫర్ ఒక అవార్డు కైవసం చేసుకున్నారు. ‘స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్’ అంశంపై హైదరాబాద్కు చెందిన వీరగోని రజనీకాంత్గౌడ్ తీసిన ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. వరంగల్కు చెందిన గొట్టె వెంకన్నకు తృతీయ బహుమతి, ఎం.గోపీకృష్ణ, గడసంతల శ్రీనివాస్, సూర్యాపేటకు చెందిన సైదిరెడ్డి, తెలంగాణ టుడేకు చెందిన సూర్య శ్రీధర్లు కన్సొలేషన్ బహుమతులు పొందారు.