పటిష్టంగా నిర్వహణ
ఖమ్మంలో 17,543 మంది, భద్రాద్రిలో 13,162 మంది హాజరు
అప్రమత్తంగా వ్యవహరిస్తూ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 28: ఉమ్మడి జిల్లాలో పది పరీక్షలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ లేకుండా అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో కలెక్టర్ వీపీ గౌతమ్ సలహాలతో జిల్లా అబ్జర్వర్ ప్రసాద్, డీఈవో యాదయ్య.. టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసేలా పర్యవేక్షించారు. ఈ నెల 23న ప్రారంభమైన పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఒకేషనల్ పరీక్షలు సోమవారం జరుగనున్నాయి. ఖమ్మం జిల్లాలో 104 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా ప్రభుత్వ, ప్రైవేట్, ఇతరత్రా యాజమాన్యాల పరిధిలో రెగ్యులర్ విద్యార్థులు 17,543 మంది హాజరయ్యారు. ప్రతి సబ్జెక్టులో 99 శాతం హాజరు నమోదైంది. డీఈవో యాదయ్య జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని కేంద్రాలనూ తనిఖీ చేశారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలో జరిగిన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 13,162 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. 173 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. సాంఘిక శాస్త్రంలో ప్రైవేట్గా ఫీజు చెల్లించిన ఐదుగురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో ఐదు ఫ్లయింగ్ స్కాడ్ టీమ్లు మొత్తం 25 పరీక్ష కేంద్రాలను పరిశీలించాయి. ఆరు పరీక్షా కేంద్రాలను డీఈవో పరిశీలించారు.
కేరింతలు కొట్టిన విద్యార్థులు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారంతో ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు బ్యాగులు సర్దుకొని పరీక్షలు పూర్తికాగానే ఇళ్లకు బయలుదేరారు. చివరిరోజు పరీక్షలు కావడంతో కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులందరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. పరీక్ష ఫలితాల తరువాత ఏయే కాలేజీల్లో చేరుతారో, ఏయే కోర్సులు చదువుకోవాలో అనే విషయాలను చర్చించుకున్నారు.