అశ్వాపురం, డిసెంబర్ 20: ధాన్యం కొనుగోలు కేంద్రా ల నిర్వహణలో పటిష్ఠ చర్యలు చేపడతామని తహసీల్దార్ సురేశ్కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. అశ్వాపురం సొసై టీ ఆధ్వర్యంలో సీతారాంపురం పంచాయతీలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం తూనికలు, కొలతల్లో తేడాలు ఉన్నాయంటూ రైతులు కొత్తగూడెం-మణుగూరు ప్రధాన రహదారిపై మంగళవారం బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేశ్కుమార్ అక్కడికి చేరుకుని ధాన్యం లారీల ట్రక్ షీట్లను, వే బిల్లులను పరిశీలించి తూనికల్లో వచ్చిన తేడాలను గుర్తించారు.
ఒక్క లారీ లోడుకు సుమారు 14 క్వింటాళ్లు తేడా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత రైస్మిల్లు యజమానితో మాట్లాడి సీతారాంపురం గ్రామానికి చెందిన బాధిత రైతు ముద్దం సంజీవరెడ్డి కోల్పోయిన సుమారు రూ.30వేలను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించి ఏ ఒక్క రైతుకు కూడా నష్టం వాటిల్లకుండా చూస్తానన్నారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. పీఏసీఎస్ సిబ్బంది, హమాలీ వర్కర్లు ప్రతిరోజూ వారి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ కాంటాల పనితీరును పర్యవేక్షిస్తూ కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యత్యాసం కలిగిన రెండు ఎలక్ట్రానిక్ కాటాలను వెంటనే మార్కెట్ కమిటీకి అప్పగించి వాటి స్థానంలో కొత్త కాటాలను వాడాలన్నారు. ధర్నాలో రైతులు పాల్గొన్నారు.