కూసుమంచి రూరల్, డిసెంబర్ 18 : పాలేరు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసినా విజయం మాత్రం బీఆర్ఎస్దే అవుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని చేగొమ్మలో టీఆర్ఎస్ నాయకుడు మల్లీడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పాలేరు నుంచి ఎంతమందైనా పోటీ చేసుకోవచ్చని, వారిని స్వాగతిస్తామని అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మట్టి పట్టుకొని స్థానికులమంటూ చెప్పుకున్నంత మాత్రన పాలేరు బిడ్డలు అయిపోరని, ఇక్కడ పుట్టినవారే స్థానికులు అవుతారని స్పష్టం చేశారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ‘పాలేరు’ ప్రజలు విజ్ఞులని, వారి కోసం పనిచేసే వారినే వారు ఆదరిస్తారని తెలిపారు. తన మొదటి ప్రాధాన్యం ప్రజలు, పార్టీ కార్యకర్తలేనని, వారికోసం నిత్యం పనిచేస్తానని అన్నారు. ప్రభుత్వ నిధులు, సొంత నిధులు ఖర్చుచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నానని గుర్తుచేశారు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో మరోపార్టీకి చోటులేదని స్పష్టం చేశారు.
మరో కోనసీమగా ‘పాలేరు’: ఎమ్మెల్సీ తాతా మధు
ఉమ్మడి రాష్ట్రంలో బీడుగా ఉన్న పాలేరు నియోజకవర్గం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ తొమ్మిదేళ్లలో మరో కోనసీమగా మారిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ప్రజలు నాటి పరిస్థితిని, నేటి అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అన్ని రాష్ర్టాలు బీఆర్ఎస్ను, కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్లో చేరికలు..
చేగొమ్మ గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొల్లికొండ వెంకన్న నేతృత్వంలో 30 కుటుంబాల వారు ఎమ్మెల్యే కందాళ, ఎమ్మెల్సీ తాతా మధు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చేగొమ్మ గ్రామానికి రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఇంటూరి శేఖర్, బానోత్ శ్రీనివాస్, రామసహాయం బాలకృష్ణారెడ్డి, వేముల వీరయ్య, ఆసిఫ్పాషా, ఊడుగు జ్యోతి, బజ్జూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.