అశ్వారావుపేట, డిసెంబర్ 16 : కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ వాటిని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. మత్స్యకారుల అభివృద్ధికి ఇప్పటికే సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీలను అందిస్తున్నది. తాజాగా కొత్త సంఘాల ఏర్పాటుకు సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానుసారం జిల్లా మత్స్యశాఖాధికారులు సొసైటీలను గుర్తించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టారు. జిల్లాలో ఇప్పటికే 49 మత్స్య సొసైటీలు ఉండగా కొత్తగా మరో 22సంఘాలను గుర్తించారు. కొత్త సంఘాల ద్వారా 459మంది మత్స్యకారులకు ఉపాధి పెరుగనున్నది. జిల్లావ్యాప్తంగా కొత్త సంఘాలతో కలిసి మొత్తం సొసైటీల సంఖ్య 59కి చేరింది. వీటిలో సభ్యులు మొత్తం 2,623 మంది ఉన్నారు. వీటికి మరో 12 సంఘాలకు అనుమతి లభిస్తే 71 సంఘాలు, 243 మంది సభ్యుల సంఖ్య పెరుగుతోంది. వీరందరికీ నైపుణ్య పరీక్షలు పూర్తి అయ్యాయి.
అధికారులు గుర్తించిన 22 కొత్త సంఘాల్లో 10 సంఘాల రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి అయ్యింది. కొత్త సంఘాల సభ్యులకు రాయితీ పథకాలు, బీమా సౌకర్యం వర్తించనున్నది. మత్స్యశాఖలో అర్హులైన కొత్త సభ్యులకు సర్కార్ తీపి కబురు అందించింది. ఎంతోకాలంగా కొత్త సంఘాల ఏర్పాటుతోపాటు సభ్యత్వాల కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. వీరందరికీ సొసైటీల ద్వారా అవకాశం కల్పించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సంఘాల్లో సభ్యత్వాలు పొందిన మత్స్యకారులకు రాయితీ పథకాలతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా సౌకర్యం వర్తిస్తుంది. కొత్త సంఘాల ఏర్పాటు కోసం జిల్లా మత్స్యశాఖాధికారులు 22 సంఘాల ద్వారా 459 మంది అర్హులను గుర్తించారు. ఇప్పటికే 10 సంఘాల రిజిస్ట్రేషన్లను అధికారులు పూర్తి చేశారు. మరో 12 సంఘాలకు అనుమతి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు ఇవీ..
మత్స్యశాఖలో సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తున్నది. ఒక చెరువు పరిధిలో 11మందికి తక్కువలో తక్కువ మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త సంఘాల ఏర్పాటుకు గ్రామంలో చెరువు(నీటి వనరు) విస్తీర్ణం 22 ఎకరాల వరకు ఉండాలి. కాల్వ లేదా ఏడాది పొడువునా నీరుండే చెరువు అయితే 11 ఎకరాలు ఉండాలి. గ్రామంలో ఏదైనా మత్స్య సొసైటీ ఉంటే ఆ సంఘం నుంచి విడిపోయి కొత్త సొసైటీ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తీర్మానం చేసుకోవాలి.
నైపుణ్య పరీక్ష పూర్తి
సొసైటీల ఏర్పాటుకు జిల్లా మత్స్యశాఖాధికారులు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. జిల్లాలో 22 కొత్త సంఘాల ఏర్పాటు కోసం గుర్తించిన 459 మంది మత్స్యకారులకు అధికారులు నైపుణ్య పరీక్ష పూర్తి చేశారు. సొసైటీలో సభ్యత్వం తీసుకునే మత్స్యకారులు చేపలు పడతారా..? లేదా..? అన్నది నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నైపుణ్య పరీక్షలో అర్హత సాధిస్తే సొసైటీల్లో సభ్యత్వం ఇస్తారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న 18 ఏళ్లు నిండిన యువత అర్హులు. కొత్తగా నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపికైన అర్హలందరికీ సొసైటీల్లో సభ్యత్వాలు లభిస్తాయి. వీరికి ప్రభుత్వం అమలు చేస్తే సబ్సిడీ, బీమా పథకాలు అందుతాయి.
పెరగనున్న ఉపాధి
కొత్త సంఘాల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 49 సంఘాలు ఉండగా వాటిలో 2,623 మంది సభ్యులు ఉన్నారు. కొత్తగా 22 సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రక్రియ పూర్తి చేశారు. వీటిద్వారా 459 మంది కొత్త సభ్యులను అర్హులుగా ఎంపిక చేశారు. ఇప్పటికే 22 సంఘాల్లో 10 సంఘాలకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ పది సంఘాల్లో 216 మంది సభ్యులు ఉన్నారు. మరో 12 సంఘాలకు అనుమతి రావాల్సి ఉంది. ఈ సంఘాల్లో 243 మంది సభ్యులు ఉంటారు. మొత్తం జిల్లావ్యాప్తంగా కొత్త సంఘాలతో కలిసి సొసైటీల సంఖ్య 71కి చేరుకుంది. సభ్యుల సంఖ్య కూడా 3,098కు చేరుతుంది.
లబ్ధి ఇలా…
మత్స్య సొసైటీలకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతున్నది. కుల వృత్తిదారులకు ఉపాధి లభిస్తున్నది. సంఘంలో సభ్యత్వం లభించిన వెంటనే బీమా సౌకర్యం కలుగుతోంది. ప్రభుత్వ పథకాలు, ఇతర సబ్సిడీలు అందుతాయి. మత్స్యకారులు 60శాతం సబ్సిడీపై వాహనాలు పొందవచ్చు. మోటర్ సైకిళ్ళు, లగేజీ ఆటోలు, మొబైల్ ఔట్లెట్స్, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ట్రక్కులు సబ్సిడీపై పొందవచ్చు. ప్రమాదవశాత్తు మృతిచెందిన సభ్యులకు ప్రమాద బీమా కింద రూ.6 లక్షలు ఎక్స్గ్రేషియా వస్తుంది. ఈ సదుపాయాలన్నీ కొత్తగా ఏర్పడే సంఘాలు, సభ్యులకు కూడా వర్తిస్తాయి.
22 కొత్త సంఘాల ఎంపిక
జిల్లాలో కొత్తగా 22 సంఘాల ఏర్పాటుకు 459 మంది సభ్యులను గుర్తించాము. వీరందరికీ నైపుణ్య పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన అనుమతుల మేరకు 10సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ సంఘాల్లో 216 మంది సభ్యులు ఉన్నారు. మరో 12 సంఘాలకు అనుమతి రావాల్సి ఉంది. జిల్లాలో 10 కొత్త సంఘాలతో కలిసి మొత్తం 59 సొసైటీలు ఉన్నాయి. వీటిలో సభ్యులు 2,839 మంది ఉన్నారు. మరో 12 సంఘాలకు అనుమతి వస్తే సంఘాల సంఖ్య 71కు చేరుతుంది. సభ్యుల సంఖ్య కూడా 3,098కు పెరుగుతుంది.
-బానోత్ వీరన్న,జిల్లా ఫిషరీస్ ఆఫీసర్, కొత్తగూడెం