కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 16: మున్సిపాలిటీల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. అందులో భాగంగా కొత్తగూడెం పట్టణాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో అన్నివర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేస్తూ ప్రతి వార్డులోని ప్రజలకు ఉపయోగపడే పనులను ప్రభుత్వం చేపడుతున్నది. ప్రతి నెలా విడుదలవుతున్న ‘పట్టణ ప్రగతి’ నిధులతో పట్టణం అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నది.
కొద్దిసేపు వర్షం కురిస్తే చాలు కొత్తగూడెంలో రైల్వే అండర్ బ్రిడ్జిలోకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే ప్రతి వాహనదారుడు, పాదాచారులు రైల్వే అండర్ బ్రిడ్జిలో నుంచి ప్రయాణించేందుకు జంకుతారు. గత ఇరవై ఏళ్ల నుంచి ఇదే అతిపెద్ద సమస్యగా ఉంది. ఎన్నిసార్లు నీటిని మోటర్ల ద్వారా తోడేసినప్పటికీ పదేపదే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా బ్రిడ్జిలో నీరు నిల్వ ఉండకుండా పక్క నుంచి కాలువ నిర్మాణం చేసి ఆ నీటిని మళ్లించేందుకు ప్రణాళికలు చేసి నిర్మాణ పనులను చేపట్టారు. ఈ కాలువ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. పట్టణ ప్రగతి నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులను చేయిస్తున్నారు. ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా పోస్టాఫీస్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు రూ.50 లక్షల నిధులతో ఫుట్పాత్ నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా ఫుట్పాత్ పక్కనే అహాదం పంచేందుకు స్టెప్ఫుడు స్పైటల్ బాల్ మొక్కలతోపాటు ఇతర మొక్కలను నాటారు. సేద తీరేందుకు బెంచీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
వార్డుల్లో అభివృద్ధి పనులు
వార్డుల్లో అవసరమైన చోట డ్రైన్లు, రోడ్ల నిర్మాణం చేపట్టారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో మొత్తం రూ.3 కోట్ల 67లక్షలు అభివృద్ధి పనులకు కేటాయించారు. ప్రతి వార్డుకు రూ.8.15లక్షలతో మొత్తం 36వార్డులు, కో-ఆప్షన్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు వార్డులకు ప్రత్యేకంగా మరిన్ని నిధులను కేటాయించి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
పట్టణ ప్రగతి నిధులతో వేగంగా అభివృద్ధి
పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెలా నిధులు విడుదలవుతున్నాయి. దీంతో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కోసం కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే పనులు చేపడుతున్నాం. పక్షపాతం లేకుండా ప్రతి వార్డుకు అవసరమైన నిధులను కేటాయించి అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. ప్రజలందరి భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.
– కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్