మామిళ్లగూడెం, డిసెంబర్ 11: నగరంలో డమ్మీ పిస్టల్తో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడడంతోపాటు ఓ ఇంట్లోకి చొరబడి ఇంట్లో వారిని బెదిరించి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలో బైపాస్ రోడ్డులోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న గడ్డమడుగు రమేశ్బాబు మరిపెడ మండలంలోని పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు ఉదయం 3:30 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు రమేశ్బాబు ఇంటి కాలింగ్ బెల్ నొక్కడంతో అతడు వచ్చి డోర్ తీశారు. వెంటనే తాను వాచ్మెన్నని, పక్కింటి వాడినని చెబుతూనే ఆ గుర్తుతెలియని వ్యక్తి రమేశ్బాబు ఇంట్లోకి చొరబడ్డాడు.
వెనువెంటనే తన దగ్గర బైక్ కీచైన్కు ఉన్న చిన్న కత్తిని రమేశ్బాబు మెడ మీద పెట్టి ఇంటి మెయిన్ డోర్ మూసి వేశాడు. ఇంట్లో ఉన్న మీ మేడమ్ను పిలవాలంటూ బెదిరించాడు. ఈ అలజడి విన్న బాధితుడి భార్య సత్యవతి హాల్లోకి వచ్చింది. వెంటనే నిందితుడు తన దగ్గర ఉన్న డమ్మీ పిస్టల్ చూపించి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు తీసి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయంతో ఆమె బెడ్రూంలోకి వెళ్లే సమయంలో బాధితుడిని పక్కకు నెట్టి చెయ్యిని గట్టిగా మెలిపెట్టి సుమారు రూ. 90 వేల విలువైన పుస్తెల తాడును లాగేసుకున్నాడు. వెంటనే ఇద్దరినీ పక్కకు నెట్టేసి తనతో తెచ్చుకున్న డమ్మీ పిస్టల్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న టూటౌన్ సీఐ శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.