బోనకల్లు, డిసెంబర్ 11: తెలుగు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన రైల్వేస్టేషన్లో కేవలం మూడు రైళ్లే ఆగుతున్నాయి. ఫలితంగా పరిసర ప్రాంత ప్రయాణికులు ఏళ్లకేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమ స్టేషన్లోనూ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలంటూ వారు వ్యక్తం చేస్తున్న ఆవేదన అరణ్య రోదనగానే మిగులుతోంది. ఢిల్లీ, ముంబై, సికింద్రాబాద్ చెన్నై, విశాఖపట్నం, తిరుపతి మధ్య రోజూ పదుల సంఖ్యలో రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైళ్లు బోనకల్లు స్టేషన్ మీదుగానే ప్రయాణిస్తుంటారు. కానీ ఇప్పటికీ ఈ స్టేషన్ల ఆగేది రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు మాత్రమే. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన 5 మండలాల్లోని సుమారు 50 గ్రామాలతోపాటు తెలంగాణలోని బోనకల్లు, చింతకాని, వైరా మండలాలకు చెందిన మరో 50 గ్రామాల ప్రయాణికులు ఈ రైల్వేస్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రజలు ఈ రైల్వేస్టేషన్ ద్వారా ఇటు సికింద్రాబాద్, ముంబయి, ఢిల్లీతోపాటు అటు విజయవాడ, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు వెళ్లాలంటే కనీసం ఏ ఒక్క రైలూ ఆగని పరిస్థితి. అటు ఖమ్మం గానీ, ఇటు మధిర గానీ వెళ్తే తప్ప ఎక్స్ప్రెస్ రైళ్లు ఎక్కే పరిస్థితి లేదు. సికింద్రాబాద్, ముంబయి, ఢిల్లీ ప్రాంతాలకు వెళ్లిన వారు ఖమ్మం రైల్వేస్టేషన్లో దిగి మళ్లీ అక్కడి నుంచి గమ్యాన్ని చేరుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఇక తిరుపతి, విశాఖపట్నం, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చే వారు విజయవాడ రైల్వేస్టేషన్లోగానీ, మధిర రైల్వేస్టేషన్లో గానీ దిగి మళ్లీ బస్సుల ద్వారా అర్ధరాత్రి వేళ చేరుకోక తప్పని పరిస్థితి. కనీసం శాతవాహన, పద్మావతి, ఇంటర్సిటీ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లనైనా బోనకల్లులో నిలుపుదల చేయాలంటూ స్థానిక ప్రజలు కోరుతున్నా రైల్వేశాఖ పట్టించుకున్న పాపానపోలేదు. కృష్ణా, గోల్కొండ ఎక్స్ప్రెస్లతోపాటు విజయవాడ డోర్నకల్, భద్రాచలం రోడ్ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. ఇవిగాక మిగతా రైళ్లు ఎక్కాలంటే బస్సుల ద్వారా 30 కిలోమీటర్ల మేర ఇటు ఖమ్మంగానీ, అటు మధిర గానీ వెళ్లాలి. అదీకాదంటే వంద కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి నేరుగా విజయవాడ వెళ్లి రైలు ఎక్కాల్సిన దయనీయ స్థితి.
ఎవరూ పట్టించుకోకపోవడం లేదు..
రైల్వే ప్రయాణికుల సమస్యలను నాయకులుగానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. ఏపీ, తెలంగాణ సరిహద్దు రైల్వేస్టేషన్ అయినప్పటికీ ఇక్కడ కేవలం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు మాత్రమే ఆగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మొదట ఖమ్మంగానీ, మధిరగానీ చేరుకొని అక్కడి నుంచి రైలు ఎక్కి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చాల్సి వస్తోంది.
–తెల్లాకుల శ్రీనివాసరావు, బోనకల్లు
రెండు ఎక్స్ప్రెస్ రైళ్లే ఆగుతున్నాయి..
బోనకల్లు రైల్వేస్టేషన్లో కేవలం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. ఈ రైళ్లు కూడా ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటల సమయంలో మాత్రమే వస్తాయి. తర్వాత దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వేరే రైల్వేస్టేషన్కు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రాత్రి వేళల్లో దూర ప్రాంతాల నుంచి గమ్యం చేరుకోవాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. బోనకల్లులో ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల
చేయాలి.-బంధం వెంకటేశ్వర్లు, బోనకల్లు