ఇల్లెందు రూరల్, నవంబర్ 25: కుల,మతాలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల్లో మసీదు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమష్టి కృషితోనే ఏదైనా సాధించగలమన్నారు. కాలనీ ఏర్పడిన నాటి నుంచి మసీదు నిర్మాణానికి స్థలం దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. అందరి కృషితో మసీద్ నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మించామని, రెండు వార్డుల్లో వీధిలైట్లను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ముస్లిం మతపెద్దలు ఎమ్మెల్యేను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాష, కమిషనర్ అంకుషావలి, కౌన్సిలర్ ఆజామ్, కోఆప్షన్ సభ్యుడు రబ్బు, ఘాజీ, డీఈ రచ్చ రామకృష్ణ, ఏఈ శంకర్, నాయకులు సిలివేరి సత్యనారాయణ, వీరస్వామి, గిన్నారపు రాజేశ్, హరికృష్ణ, నీలం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే
టేకులపల్లి మండలం బేతంపూడికి చెందిన అజ్మీరా శ్రీదేవికి రూ. లక్ష, కామేపల్లి మండలం గోవింద్రాల బంజరకు చెందిన ఎం తోల్చకు రూ. లక్షా 50 వేల ఎల్వోసీ చెక్కులను ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపద సమయాల్లో సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని, వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేశ్, సత్తాల హరీశ్, బానోత్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
నేడు ఇల్లెందుకు మంత్రి పువ్వాడ, ఎంపీలు రాక
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం ఉదయం 11 గంటలకు ఇల్లెందు వస్తున్నారని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ తెలిపారు. శుక్రవారం ఇల్లెందు క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఇల్లెందు పట్టణంలో తొలిసారిగా సింగరేణి హైస్కూల్లో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ, విశిష్ట అతిథులుగా ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరవుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.
ఎమ్మెల్యేకు సన్మానం
మండలంలోని ఇందిరానగర్, బాలాజీనగర్ గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరు చేయించిన ఎమ్మెల్యే హరిప్రియకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీలకు మంజూరైన బీటీరోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.