అశ్వారావుపేట, నవంబర్ 25 : వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లకు సర్కార్ తాజా నిర్ణయంతో ఊరట లభించింది. ప్రస్తుతం ఉన్న పదవీ కాలాన్ని మరో సంవత్సర కాలం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది నుంచి ఏఎంసీల పదవీ కాలం రెండేళ్లపాటు కొనసాగనున్నది. దీంతో ఏఎంసీల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. ఇప్పటివరకు మార్కెట్ కమిటీల పాలకవర్గాల్లో సభ్యులు 14మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్యను 18కి, అదేవిధంగా 8మంది రైతులకు గాను 12మందికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అన్నివర్గాల ప్రజలు, రైతులకు అవకాశం ఇస్తూ కమిటీ చైర్మన్లు, కార్యవర్గం నియామకంలో రిజర్వేషన్లు కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 14 ఏఎంసీలు ఉండగా వీటిలో ఖమ్మంలో 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 ఉన్నాయి. గతంలో ఏడాది మాత్రమే ఉన్న ఏఎంసీల పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండేళ్లకు పెంచడంతో మరింత అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో 14 ఏఎంసీలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 14 ఏఎంసీలు ఉన్నాయి. జిల్లా విభజనకు ముందు ఖమ్మం జిల్లాలో 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మద్దులపల్లి ఏఎంసీని కొత్తగా ఏర్పాటు చేయడంతో ఏఎంసీల సంఖ్య 8కి చేరింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఏఎంసీల సంఖ్య 14కు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట, కొత్తగూడెం, బూర్గంపాడు, నూగూరు చర్ల, భద్రాచలం, ఇల్లెందు మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కల్లూరు, వైరా, మధిర, సత్తుపల్లి, ఏన్కూరు, నేలకొండపల్లి, మద్దులపల్లి ఏఎంసీలు ఉన్నాయి. మార్కెట్ కమిటీలో ఇప్పటివరకు 14మంది సభ్యులు ఉండగా మరో నలుగురికి అవకాశం కల్పించడంతో ఆ సంఖ్య 18కి పెరిగింది. ఇందులో రైతులకు అధిక ప్రాధాన్యత కల్పించింది. కమిటీలో 8మంది రైతులు కొనసాగుతుండగా మరో నలుగురికి అవకాశం ఇవ్వడంతో రైతుల సంఖ్య కూడా 12కి చేరింది. కొత్తగా నియామకమైన కమిటీలు ఆరు నెలలు లేదా ఏడాది పూర్తి చేసుకున్నా మిగతా సమయం వర్తించనున్నది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది.
రిజర్వేషన్లు ఇలా..
మార్కెట్ కమిటీల నియామకంలో ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించింది. కమిటీ పాలకవర్గంలో వ్యాపారులు- 2, బీసీ -1, ఎస్టీ -1, మహిళ -1, మైనార్టీ -1 చొప్పున రిజర్వేషన్లు ఉన్నాయి. వీటితోపాటు సొసైటీల నుంచి- 1, సర్పంచ్ లేదా మున్సిపాలిటీ నుంచి -1, వ్యవసాయ మార్కెట్ కమిటీ జిల్లా అధికారి- 1, వ్యవసాయశాఖ నుంచి- 1 ఉంటారు. వీరందరూ ఈ ఏడాది నుంచి రెండేళ్లపాటు కొనసాగుతారు. మార్కెట్ కమిటీల పదవీ కాలం రెండేళ్లకు పెంచడంతో అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వెసులుబాటు కలుగుతుందని పాత కమిటీ చైర్మన్లు, పాలకవర్గాల సభ్యులు పేర్కొంటున్నారు.
రైతులకు మెరుగైన సేవలు
వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నది. మార్కెట్ కమిటీలను బలోపేతం చేసేలా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తూ మద్దతు ధర అందిస్తున్నది. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు రూ.వేల కోట్లు వెచ్చించి గోదాములు నిర్మించింది. రైతులకు విశేష సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏఎంసీల పదవీ కాలాన్ని రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ గిట్టుబాటు ధర లభించే వరకు ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాములు నిర్మిస్తున్నది.
పదవీ కాలం రెండేళ్ళకు పెంపు
వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీ కాలాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 14 మంది ఉండే పాలకవర్గ సభ్యుల సంఖ్యను 18కి పెంచి మరికొందరికి కమిటీల్లో అవకాశం కల్పిస్తున్నది. పాలకవర్గాల నియామకంలోనూ రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలకవర్గాలు నియమించబడతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 14 ఏఎంసీలు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి.
– ఎంఏ అలీమ్, జిల్లా మార్కెటింగ్ అధికారి, కొత్తగూడెం