కూసుమంచి, నవంబర్ 21: ఆవులకు సోకుతున్న ముద్ద చర్మ వ్యాధి రైతులను కలవర పరుస్తోంది. ఈ వ్యాధి గురించి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమై ఇప్పటికే టీకాలు వేసినప్పటికీ పలు గ్రామాల్లో లేగ దూడలకు, తెల్ల పశువులకు సోకుతోంది. కాళ్ల వాపు, మెడ వాపు, బొబ్బల వంటివి ఈ వ్యాధి లక్షణాలు. అధిక తీవ్రత ఉంటే మాత్రం వ్యాధి సోకిన 10 నుంచి 15 రోజుల్లోనే పశువులు మృత్యువాత పడుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కన్పిస్తోంది. మిగిలిన మండలాల్లో తీవ్రత కొంత తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. దీంతో రైతులందరూ తమ పశువులను ఖమ్మం పశువైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. దీంతో కొన్ని పశువుల్లో వైరస్ తగ్గుముఖం పడుతుండగా తీవ్రత ఎక్కువ ఉన్న పశువులు మాత్రం మృత్యువాతపడుతున్నాయి.
పాడిరైతుల్లో కలవరం..
తెల్ల పశువుల్లో ఎక్కువగా వస్తున్న ముద్ద చర్మ వ్యాధితో ముఖ్యంగా లేగ దూడలు నరకం చూస్తున్నాయి. వ్యాధి సోకిన రెండో రోజు నుంచి పశువు చర్మం నిండా బొబ్బలు రావడం, తరువాత అవి పగిలి రసి కారడం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. స్థానికంగా మందులు లేకపోవడంతో రైతులు ఖమ్మం వెళ్లి తీసుకొని రావాల్సి వస్తోంది. తీవ్రతను బట్టి నేరుగా పశువులనే ట్రాలీ ఆటోల్లో ఎక్కించి ఖమ్మం తరలిస్తున్నారు. కొన్ని చోట్ల మందులు వాడినప్పటికీ వైరస్ సోకుతుండడం, తగ్గకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. మరికొన్ని చోట్ల లేగ దూడలు చనిపోతుండడంతో ఆవులు పాలు ఇవ్వని దృశ్యాలు మరికొన్ని చోట్ల కన్పిస్తున్నాయి.
వ్యాధి లక్షణాలు ఇలా..
ఏడాదిలోపు వయసున్న తెల్లపశువులకు ముద్ద చర్మ వ్యాధి అధికంగా సోకుతోంది. దీంతో అవి తట్టుకోలేక పోతున్నాయి. శరీరంపై బొబ్బలు రావడంతో పడుకోలేక పోతున్నాయి. కాళ్లు, మెడలకు వాపులు వస్తుండడం, అవి విపరీతమైన నొప్పి కలిగిస్తుండడంతో అవి తాళలేకపోతున్నాయి. నోటి నిండా పొక్కులు కావడం, కనీసం తినలేక పోవడం, జ్వరం రావడం, శరీరం మొత్తం నల్లబారిపోవడం, మేత మేయలేకపోవడం, కుడితి తాగలేకపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కన్పిస్తున్నాయి.
రాజస్థాన్ నుంచి వ్యాక్సిన్..
ముద్ద చర్మ వ్యాధికి తెలుగు రాష్ర్టాల్లో మందు లేకపోవడంతో వైద్యాధికారులు రాజస్థాన్ నుంచి తెప్పించి వేస్తున్నారు. ఇది అంటువ్యాధి కావడంతో ఇతర పశువులకూ సోకే ప్రమాదం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పశువులు నరకం చూస్తున్నాయి. నోటి పొక్కులు ఉన్న ఆవులకు రైతులు రాగి జావ, జొన్న గటక పోస్తున్నారు. కూసుమంచికి చెందిన గుండా చంద్రారెడ్డి లేగదూడకు కూడా ఈ వ్యాధి సోకడంతో ఖమ్మం తీసుకెళ్లి వైద్యం చేయించారు. తరువాత అది కోలుకుంది. ప్రస్తుతం పిట్టల సీతయ్య అనే రైతుకు చెందిన లేగదూడ ఇదే వ్యాధి సోకింది. మేత మేయలేక అవస్థలు పడుతోంది. కూసుమంచి, గైగోళ్లపల్లి, జుఝల్రావుపేట, మల్లేపల్లి, చౌటపల్లి, జీళ్లచెరువు తదితర గ్రామాల్లోని దూడలకూ ఈ వ్యాధి సోకింది.
రాగి జావ, గటక తాపిస్తున్నాం..
ఎంతో చలాకీగా ఉండే మా ఆవుదూడకు బొబ్బల వ్యాధి సోకింది. నోటి నిండా పుండ్లు, పొక్కులతో పది రోజులుగా మేత మేయలేక అవస్థ పడుతోంది. రోజూ నాలుగు దఫాలుగా రాగి జావ, జొన్న గటక తాపిస్తున్నాం. తల్లి ఆవు దగ్గర పాలు కూడా తాగడం లేదు. దీంతో పెద్ద ఆవుకూ సమస్య అవుతోంది. అది పాలు కూడా ఇవ్వడం లేదు. ఖమ్మం తీసుకెళ్లి పశువైద్యులకు చూపించా. మందులు తెచ్చి వాడుతున్నా. తెల్లగా ఉండే ఆవు దూడ క్రమంగా నల్ల రంగులో కన్పిస్తోంది.
-గుండా చంద్రారెడ్డి, పాడి రైతు , కూసుమంచి
జీవం చనిపోయింది..
మా ఎద్దుకూ ముద్ద చర్మవ్యాధి సోకింది. శరీరమంతా బొబ్బలు వ్యాపించాయి. ఆ సమయంలో మేత మేయలేకపోయింది. కసీనం కట్టుమడిలో పడుకోలేదు కూడా. అదే నీరసంతో 15 రోజుల్లోనే చనిపోయింది. వ్యాధి సోకిన రెండు రోజులకే పూర్తిగా నీరసించింది. మేత మేయలేకపోయింది. ఈ వ్యాధి లేగ దూడలకే వ్యాపిస్తుందని అంతా అన్నారు. కానీ మా ఎద్దుకు కూడా వ్యాపించింది. కూసుమంచి వెళ్లి మందులు తెచ్చి వాడినా ప్రయోజనం లేకపోయింది.
– జగన్నాథం, రైతు, కూసుమంచి