గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మార్కెట్ ఖజానాకు ఖమ్మం ఏఎంసీ మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్నది.. ప్రస్తుతం అపరాల సీజన్ ముగిసింది. నెల రోజులుగా పత్తి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు మిర్చి పంట తరలివస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెస్ ద్వారా రూ.17.61 కోట్ల ఆదాయం రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించగా మార్కెట్ ఏకంగా రూ.25 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది రూ.25.23 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించగా ఈ నెల 19వరకు మార్కెట్ రూ.15.88 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి లక్ష్యానికి చేరువవుతున్నది. వచ్చే మార్చిలోపు లక్ష్యాన్ని అధిగమించే దిశగా పాలకవర్గం, యంత్రాంగం అడుగులు వేస్తున్నది. అదే జరిగితే ఖమ్మం మార్కెట్ మరో రికార్డును నెలకొల్పడం ఖాయం.
– ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 20
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 20: నిరుటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖమ్మం ఏఎంసీ మంచి ఆదాయం తీసుకొచ్చే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం అపరాల సీజన్ ముగిసింది. పత్తి పంటను రైతులు నెల రోజులుగా మార్కెట్కు తీసుకొస్తున్నారు. అధిక ఆదాయం తెచ్చే మిర్చి పంట ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. భారత పత్తి సంస్థ కేంద్రాలు, మక్క, పెసర కొనుగోలు కేంద్రాలు లేనప్పటికీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆదాయం మెరుగైన స్థాయిలో ఉంది. ఈ ఏఎంసీ తన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంతోపాటు నిరుటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏకంగా లక్ష్యానికి మించి ఆదాయం సమకూర్చుకునే అవకాశం కన్పిస్తోంది. 2021-22 సంవత్సరానికి గాను ఖమ్మం మార్కెట్కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ రూ.17.61 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఊహించని విధంగా ఏకంగా రూ.25 కోట్ల ఆదాయం సంపాదించి రాష్టంలోనే రెండో అత్యుత్తమ మార్కెట్గా అవార్డు సొంతం చేసుకుంది.
పెరుగుతున్న ఆదాయం..
పాలకవర్గ బాధ్యులు, అధికారుల సమన్వయం, పంటల ధరల పెరుగుదల వంటివి మార్కెట్ అధిక ఆదాయం సంపాదించడంలో కీలకపాత్ర పోషించాయి. అధిక ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మార్కెట్లో మక్క, పెసరతోపాటు భారత పత్తి సంస్థ (సీసీఐ) పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. పంటల సాగు విస్తీర్ణం ఆశించిన మేర జరుగలేదు. పెసర, కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. పత్తి పంటకు మద్దతు ధర పెరిగినప్పటికీ సీసీఐ కేంద్రాలు అవసరం లేకుండా పోయాయి. దీంతో మార్కెట్కు అదనపు ఆదాయం వచ్చే మార్గాలు లేకుండా పోయాయి. అయినప్పటికీ ఈ సంవత్సరం ఆదాయం మంచి పురోగతిలో ఉండడం విశేషం. నిరుడు ఇదే సమయానికి మార్కెట్ ఆదాయం రూ.8.91 కోట్లు కాగా, ఈ సంవత్సరం రూ.15.88 కోట్లకు చేరుకుంది.
ఈ సంవత్సరం పత్తి పంటకు సీసీఐ క్వింటాకు రూ.250 పెంచి రూ.6,380గా ప్రకటించింది. అయితే ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు అంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీంతో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు తెరమరుగయ్యాయి. సాధారణంగా మార్కెట్కు ఎక్కువ ఆదాయం కేవలం మిర్చి పంటపైనే వస్తుంది. సీసీఐ కేంద్రాలు లేనప్పటికీ, మిర్చి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా ప్రారంభం కానప్పటికీ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఖమ్మం ఏఎంసీ సంపాదించింది.
ఆదాయంపై వివిధ అంశాల ప్రభావం..
కేవలం ఎనిమిది నెలల్లోనే రికార్డు స్థాయిలో మార్కెట్ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం పంటల ధరల పెరుగదలే. ఈ సంవత్సరం వానకాలం సీజన్ నుంచే మార్కెట్లో అపరాలు, వాణిజ్య పంటల ధరలు పోటీపడి మరీ పెరిగాయి. పెసర మద్దతు ధర క్వింటా రూ.7,275 కాగా రూ.6,500 నుంచి రూ.6,900 వరకు ధర పలికింది. కంది మద్దతు ధర రూ.6,300 కాగా దాదాపుగా అదే ధరలో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రధాన పంటలైన పత్తి, మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి.
పత్తి మద్దతు ధర రూ.6,380 కాగా రూ.8 వేలకు పైగా వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీని గరిష్ఠ ధర రూ.9 వేలు. మిర్చి పంట ధర కూడా నిరుటికంటే అధికంగానే పలుకుతోంది. నిరుడు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ పలుకగా.. ప్రస్తుతం ఏసీ రకం పంటకు క్వింటాకు రూ.20 వేలకుపైగానే పలుకుతోంది. వీటితోపాటు హోల్సేల్ కూరగాయల మార్కెట్ కూడా నిరుటితో పోల్చితే మంచి ఆదాయం తెచ్చిపెట్టింది. పాలకవర్గం, యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగడంతో అనతి కాలంలోనే మార్కెట్ ఆదాయం రెట్టింపు అయింది.
మొదటి స్థానంలో నిలపడమే ధ్యేయం
ఖమ్మం ఏఎంసీని రాష్టంలోనే ముందు వరుసలో నిలపడమే ప్రధాన ధ్యేయం. నిరుడు ఖమ్మం మార్కెట్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. పంటను కొనుగోలు చేసిన ఖరీదుదారులు నిర్దేశిత సమయంలో మార్కెట్కు పన్ను కట్టాలి. తద్వారా మార్కెట్ అభివృద్ధి చెందుతుంది. గతంతో పోల్చితే ప్రస్తుతం పన్ను వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో మార్కెట్ ఆదాయం రెట్టింపయింది. పంటల ధరల పెరుగుదల కూడా కారణంగా ఉంది.
– రుద్రాక్ష మల్లేశం, ఉన్నతశ్రేణి కార్యదర్శి, ఖమ్మం ఏఎంసీ
సాంస్కృతిక జాబిలి.. ‘నెలానెలా వెన్నెల’
ఖమ్మం కల్చరల్, నవంబర్ 20: సాంస్కృతిక చందమామగా ‘నెలనెలా వెన్నెల’ కార్యక్రమం కొనసాగుతోందని, కళారంగానికి మరింత వైభవం తీసుకొస్తోందని వక్తలు పేర్కొన్నారు. అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ( ఆర్క్స్) ఆధ్వర్యంలో నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ‘నెలనెలా వెన్నెల’ కార్యక్రమంలో సంస్థ సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ కళపై పట్టు, ప్రేమతో 64 నెలలుగా నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభలో ఖమ్మం కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగబత్తిని రవి సతీమణి నాగబత్తిని మాలతి ప్రథమ వర్థంతిని నిర్వహించారు.
మాలతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాంకు ఉద్యోగిగా, కళా పోషకురాలిగా మాలతి చేసిన సేవలను స్మరించారు. మాలతి పేరిట సుమారు వందమంది దివ్యాంగులు, నిరుపేద కళాకారులకు ఆర్థిక సహాయం, చీరలు అందజేసి సత్కరించారు. అనంతరం పొన్నూరు రసఝరి కళాకారులు ప్రదర్శించిన ‘గుర్తు తెలియని శవం’ నాటిక ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సభకు ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షుడు వీవీ అప్పారావు అధ్యక్షత వహించగా, ఎఎస్ కుమార్, వేల్పుల విజేత, చెరుకూరి కృష్ణమూర్తి, సమ్మయ్య, పుతుంబాక కృష్ణప్రసాద్, నాగబత్తిని రాజచైతన్య, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానందం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.