రఘునాథపాలెం, నవంబర్ 11: దేశంలోకెల్లా తెలంగాణలో మాత్రమే నాణ్యమైన విద్య లభిస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్య, మైనార్టీ దినోత్సవాల సందర్భంగా రఘునాథఫాలెం మండలంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ఎంపీ నామా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యను దేశవ్యాప్తంగా అందించేందుకు అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషిని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. వాటి ద్వారా పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందిస్తోందని వివరించారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు గతంలో ఏ ప్రభుత్వాలూ ఇలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమంగా రాణించిన విద్యార్థులను, పలు క్రీడా పోటీల్లో రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులకు ఎంపీ, ఎమ్మెల్సీలు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ అబిదా సల్మా, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆర్ఎల్సీ అరుణకుమారి, మైనారిటీ స్కూల్స్ విజిలెన్స్ అధికారులు జమీల్, సీతారాములు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల నివాళి..
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ చిత్రపటాలకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పూలమాలలు వేశారు. విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. ఖమ్మం రూరల్, కారేపల్లి, పాల్వంచల్లో ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.