అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. ఉరకలెత్తిన ఉత్సాహం వెల్లువైంది.. జన హృదయాల్లో నయా జోష్ నింపింది.. వెరసి ఖమ్మం నగరంలో శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది.. యువనేతను చూసేందుకు భారీగా జన వాహిని తరలివచ్చింది.. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడింది.. సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఆద్యంతం ఉత్తేజకరంగా సాగింది.. ఎనిమిదేళ్లలో ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు మంత్రి వివరించారు. ఈ సమయంలో జనం కరతాళ ధ్వనులు మిన్నంటాయి.. టీఆర్ఎస్ శ్రేణుల కేరింతలు స్టేడియంలో ప్రతిధ్వనించాయి..
– నెట్వర్క్
రఘునాథపాలెం సమీపంలో 14 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్ ప్రారంభించారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. పార్క్ ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
పాదచారులు రోడ్డు పక్కన నడిచి ప్రమాదాల బారిన పడొద్దు. ప్రజలకు భద్రతకు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. ఈ లక్ష్యంతోనే ఖమ్మం నగరంలో ఫుట్పాత్లు ఏర్పాటు చేసింది. ఫుట్పాత్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి అజయ్కుమార్, ఎంపీ నామా, నగర మేయర్ నీరజ ఫుట్పాత్పై నడిచారు. స్థానికులతో మాట్లాడారు.
అందం.. ఆహ్లాదానికి కేరాఫ్ నగరంలోని లకారం ట్యాంక్బండ్. చెరువుపై రూ.8 కోట్ల నిధులతో సస్పెన్షన్ వంతన నిర్మాణం పూర్తయింది. మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్ బ్రిడ్జిని ప్రారంభించారు.అందరూ మెచ్చే విధంగా బ్రిడ్జి ఏర్పాటైందన్నారు. వారి వెంట ఎంపీ నామా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని ఉన్నారు.
నగరంలోని ప్రకాశ్నగర్లో అన్ని వసతులతో ఆఖరి మజిలీ రూపుదిద్దుకున్నది. మున్నేరు పక్కనే ఉన్న ఈ వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మున్నేటి పరిసరాలను పరిశీలించారు. భూగర్భజలాల పెరుగుదలపై అధికారులను ఆరా తీశారు. కార్యక్రమంలో మంత్రి అజయ్కుమార్, ఎంపీ నామా, నగర మేయర్ పాల్గొన్నారు.
నగరంలోని టేకులపల్లిలో రెండో దశలో పూర్తి చేసిన 240 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. యువనేత రాకతో డబుల్ బెడ్రూం సముదాయంలో పండుగ వాతావరణం నెలకొన్నది. మంత్రి గృహ సముదాయాలను పరిశీలించారు. గృహస్తులతో మాట్లాడారు. ఆయనతో కరచాలనం చేయడానికి ఆసక్తికనబరిచారు.
పాత మున్సిపల్ కార్యాలయమే నేటి సిటీ సెంట్రల్ లైబ్రరీ. తాజాగా నగరపాలక సంస్థ ఆ భవనాన్ని ఆధునీకరించింది. నూతన హంగులతో ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి అజయ్కుమార్తో కలిసి గ్రంథాలయంలో కల్పించిన వసతులను పరిశీలించారు. వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు.