స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన మహిళా రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్పీసీ) సత్ఫలితాలనిస్తున్నాయి.. మిర్చి సేకరించేందుకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన సంఘాల ద్వారా అంచనాలకు మించి ఆదాయం వస్తున్నది.. ప్రభుత్వ ప్రోత్సాహంతో సభ్యులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఆయా కేంద్రాల నుంచి మిర్చి సేకరించి కేవలం రెండు నెలల్లోనే రూ.39.19 కోట్ల టర్నోవర్ సాధించారు.. ‘ప్లాంట్ లిపిడ్స్’ సంస్థ నుంచి ఏకంగా రూ.96 లక్షల కమీషన్ సాధించారు.. మంచి ఆదాయాన్ని ఆర్జించారు.. డీఆర్డీఏ సహకారంతో మున్ముందు లాభాలను తెచ్చి పెట్టే పంటలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మామిళ్లగూడెం, మే 23: స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరిన మహిళలు అనేక రంగాల్లో సమర్థంగా రాణిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సేవ, వ్యాపార రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. వినూత్న పద్ధతిలో ఆలోచించి రైతుల పండించిన పంటను సేకరిస్తున్నారు. తద్వారా కమీషన్ సాధించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న మహిళా రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్సీపీ)పై ప్రత్యేక కథనం.
జిల్లాలో తేజా రకం సన్న మిర్చి అత్యధికంగా సాగవుతుంది. ఈ రకం మిర్చిలో గింజ ఎక్కువగా ఉంటుంది. గింజల నుంచి నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ నూనెను ‘ప్లాంట్ లిపిడ్స్’ సంస్థ విదేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఖమ్మానికి సమీపంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో సంస్థ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లా రైతుల నుంచి మిర్చి కొనుగోలుకు ప్రభుత్వంతో సంస్థ సంప్రదింపులు జరిపి ఎఫ్పీసీల ద్వారా సేకరించడానికి సెర్ప్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో ఎఫ్పీసీ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. కామేపల్లి, ఏన్కూరు, సింగరేణి, మధిర, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులను సమన్వయం చేయడం కోసం ఏన్కూరు మండలం సిరివెన్నెల ఎఫ్పీసీ, మధిర మండలం మధిర ఎఫ్పీసీ, కొణిజర్ల మండలం ఆదర్శ ఎఫ్పీసీలకు కంపెనీ కమిషన్ చెల్లించింది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుచి మార్చి వరకు ఎఫ్పీసీలు రూ.39.19 కోట్ల విలువైన 2,147 టన్నుల మిర్చిని సేకరించింది. సంఘాలు సమన్వయకర్తగా వ్యవహరించినందుకు ప్రాసెసింగ్ సంస్థ ప్లాంట్ లిపిడ్స్ ప్రతి కిలోకు రూ.3 నుంచి రూ.5 వరకు కమీషన్ చెల్లిస్తున్నది. జిల్లాలోని మూడు రైతు ఉత్పత్తి సంఘాలు కేవలం రెండు నెలల్లో రూ.96 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.
ఎఫ్పీసీ నేరుగా కల్లాల వద్దే పంట కొనుగోలు చేస్తుండడంతో రైతులకు రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. మార్కెట్లో పంట కొనే కొనుగోలుదారులు రైతుల నుంచి కమీషన్ తీసుకుంటారు. ఇక్కడ దానికి ఆస్కారం లేదు. తరుగు తీసే పద్ధతి లేదు. ఇతర మార్కెట్లో పంట కాంటా వేసినప్పుడు కిలోలకు అదనంగా వచ్చే గ్రాములను లెక్కలోకి తీసుకునే పద్ధతి ఉండదు. రౌండ్ ఫిగర్ లెక్కవేసే పద్ధతి అమలులో ఉంటుంది. ఎఫ్పీసీలో ప్రతి గ్రాముకు లెక్క ఉంటుంది.
ఇక్కడ పంట విక్రయిస్తే బహిరంగ మార్కెట్లో కంటే ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. సెర్ప్ స్థాపించిన బెనిషాన్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. ముందు జాగ్రత్తగా కలెక్టర్ గౌతమ్ వద్ద ‘ప్లాంట్ లిపిడ్స్’ సంస్థ రూ.కోటి డిపాజిట్ చేయడంతో రైతులకు నమ్మకం ఎఫ్పీసీపై కలిగింది. వచ్చే ఏడాది 6 వేల టన్నుల మిర్చిని సేకరించాలని ఎఫ్పీసీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదే విధంగా ఇతర జిల్లాల నుంచి పసుపు సేకరించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
దళారుల ప్రమేయంతో రైతులు నష్టపోతున్నారు. అదనపు ఖర్చులతో రైతులు సతమతమవుతున్నారు. పంటలకు మంచి ధర అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. రైతులకు సేవ చేస్తున్నామనే ఆనందంలో ఉన్నా. కలెక్టర్ చొరవ తీసుకుని ప్రైవేటు కంపెనీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. మొదట్లో రైతులు పంట విక్రయించడానికి ఇబ్బంది పడ్డారు. తర్వాత అన్ని విషయాలపై స్పష్టత తీసుకుని రైతులు పంట విక్రయిస్తున్నారు. ఎఫ్పీసీకి కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు స్లాబ్ సిస్టంలో కమిషన్ ఉంటుంది. ఈ పద్ధతిలో రైతులకు లాభాలు. మాకూ ఆదాయం.
– స్వర్ణ కృష్ణవేణి, సిరివెన్నెల ఎఫ్పీసీ అధ్యక్షురాలు
అదనపు ఖర్చు లేకుండానే మిర్చిని విక్రయించాం. బేరగాళ్ల దగ్గర 38.9 కిలోల కాంటా అయితే 900 గ్రాములు లెక్కలోకి తీసుకోరు. కానీ ఎఫ్పీసీలో మాత్రం ప్రతి గ్రామును లెక్క చూపించే పద్ధతి అమలులో ఉంది. ఈ పద్ధతిలో రైతులకు లాభం జరుగుతుంది. రైతులు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది 150 క్వింటాళ్ల మిర్చిని మహిళా సంఘాలకే విక్రయించా.
– రాంబాబు, రైతు, జన్నారం, ఏన్కూరు మండలం
జిల్లాలో ఇప్పటివరకు మహిళా సంఘాలు, ఎఫ్పీసీలు ధాన్యాన్ని కోనుగోలు చేశాయి. మామిడి, జామ, సపోటా, బొప్పాయి పండ్లు కొనుగోలు చేసి వ్యాపారం కొనసాగించాయి. తొలిసారిగా మిర్చి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మిర్చి నుంచి నూనె తీసే సంస్థ కొనుగోలుకు ముందుకు వచ్చింది. సభ్యులు కష్టపడి పని చేసి రెండు నెలల్లోనే రూ.96 లక్షల ఆదాయాన్ని ఆర్జించారు. రానున్న రోజుల్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం