భద్రాచలం, మార్చి 25: పట్టణంలోని వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి అర్చకులు కల్యాణం జరిపారు. కార్యక్రమంలో బండారు కృష్ణయ్య, కటుకూరి హరిబాబు, గంటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, మార్చి 25: మండల కేంద్రంలోని రామానుజవరంలో సంతాన వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వార్లకు తహసీల్దార్, రామనుజవరం ప్రత్యేకాధికారి రాఘవరెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అదేవిధంగా మణుగూరు మునిసిపాలిటీలోని శివలింగాపురం ఏరియాలో వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కల్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
సారపాక, మార్చి 25: బూర్గంపాడు మండలంలోని ఇరవెండిలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి తిరుకల్యాణం సోమవారం కనుల పండువగా జరిగింది. తాళ్లూరి ట్రస్టు చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్యతో పాటు ఎన్నారైలు డాక్టర్ అనితారాణి-గొట్టిపాటి ప్రవీణ్కుమార్, ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ-విజయ రేణుక దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించగా అర్చకులు వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు.
అశ్వాపురం, మార్చి 25: మండల పరిధిలోని సండ్రలబోడు గ్రామంలో బండ్లసిరిగుట్టపై కొలువైన శ్రీదేవి భూదేవి సమేత అభయ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తుళ్లూరి బ్రహ్మయ్య, ముత్తినేని సుజాత, ఓరుగంటి భిక్షమయ్య పాల్గొన్నారు.
చర్ల, మార్చి 25: మండలంలోని లక్ష్మీకాలనీ పంచాయతీ దేవానగరం కొండగుహలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి కల్యాణాన్ని సోమవారం అర్చకులు అత్యంత వైభవంగా జరిపించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు కల్యాణానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పర్ణశాల, మార్చి 25: మండల పరిధిలోని సున్నంబట్టి గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని అర్చకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. కొండ కృష్ణబాబు, పిన్నింటి స్వాతి, అర్జున్, ప్రభాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి, మార్చి 25: అన్నపురెడ్డిపల్లి బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో యజ్ఞాచార్యులు గిరిధరాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రాధాకృష్ణుల కళ్యాణం ఇల్లెందు రూరల్, మార్చి 25: మండల పరిధిలోని కొమరారంలోని రాధాకృష్ణుల ఆలయంలో ఆలయ నిర్వాహకురాలు కోరం కోటమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం నిర్వహించారు. కోటమ్మ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా హోలీ రోజున రాధాకృష్ణుల కల్యాణం నిర్వహిస్తున్నామన్నారు.