భద్రాచలం, ఫిబ్రవరి 22: గర్భిణులకు సాధారణ ప్రసవాలే చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు. భద్రాచలంలోని ఐటీడీఏ పీవో కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితోపాటు పలు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన స్త్రీల వైద్య నిపుణులు, రేడియాలజిస్టులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆసుపత్రులకు ఏజెన్సీ నుంచి నిరుపేదలే వస్తారని, వారి నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన మానుకోవాలని సూచించారు.
ముఖ్యంగా గర్భిణులకు సాధారణ ప్రసవాలే చేయాలని, అత్యవసరమైతే తప్ప సిజేరియన్ ఆపరేషన్లు చేయొద్దన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన అనుమతులు లేకుండా గర్భిణులకు గర్భస్రావం చేసినా నేరమేనన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్వో శిరీష, వైద్యులు రామకృష్ణ, చైతన్య పాల్గొన్నారు.