మంచి కొలువు సాధించాలంటే ఏళ్లకు ఏళ్లు చదువులు చదవాల్సిన అవసరం లేదు. పేరు పక్కన డిగ్రీలు అవసరం లేదు.. కేవలం పదోతరగతి పూర్తయితే చాలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ) చదవొచ్చు. కోర్సు పూర్తయితే చాలు ఏదో ఒక పరిశ్రమలో ఉద్యోగం దొరికేది. రెండు దశాబ్దాల క్రితం నుంచి ఈ కోర్సుకు క్రేజ్ ఉంది. ఏమైందో తెలియదు కానీ.. గత కొద్ది సంవత్సరాలుగా కోర్సుకు డిమాండ్ తగ్గింది. విద్యార్థులు కోర్సును ఎంచుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదు. విద్యార్థులు లేక కళాశాలలు వెలవెలబోతున్నాయి. ఐటీఐ కోర్సులు తీసుకుంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తొమ్మిది ఐటీఐ కళాశాలలు ఉండగా యువత అడ్వాన్స్డ్ కోర్సులైన ‘ఐవోటీ స్మార్ట్ అగ్రికల్చర్’, ‘సోలార్ టెక్నీషియన్’ను ఎంచుకుంటుండడం విశేషం.
– ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 7
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 7 : డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు.. పెద్ద పట్టాలు పుచ్చుకోవాల్సిన పనిలేదు.. చదువులకు వేలకు వేలు ఖర్చు చేయనక్కర్లేదు.. పదో తరగతి తర్వాత వృత్తి విద్యా కోర్సు పూర్తి చేస్తే చాలు వెంటనే ఉపాధి మార్గం దొరికేది. ఐటీఐ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) పూర్తైన వెంటనే ఉద్యోగ అవకాశాలను మోసుకొచ్చేది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు వేల మందికి బతుకు దారి చూపించింది. అంతటి ఉపాధి కలిగిన ఐటీఐ కోర్సుల్లో ఇప్పుడు విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. శిక్షణ పూర్తైయితే ఉజ్వల భవిష్యత్ అందుతున్నప్పటికీ విద్యార్థులు వృత్తి విద్యాకోర్సులను ఎంపిక చేసుకోకపోవడంతో కళాశాలలు వెలవెలబోతున్నాయి. ఐటీఐలో ప్రవేశాల కోసం ఇటీవల ప్రథమ ఫేజ్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగా 10శాతం సీట్లు కూడా భర్తీకాకపోవడం ఆశ్చర్యానికి గురికాకతప్పదు. అయితే కొత్త కోర్సులైన ఐఓటీ స్మార్ట్ అగ్రికల్చర్, సోలార్ టెక్నీషియన్లో ఆసక్తి కనబరుస్తున్నారు.
జిల్లాలో 9 కళాశాలలు
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 9 ఐటీఐ కళాశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఒకటి కాగా, మిగిలిన 8 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. సత్తుపల్లి(జేవీఆర్), వీఎం బంజర(భద్రగిరి), మధిర(ఎస్ఈఎస్ నాగేంద్ర)లో ఒక్కొటి ప్రైవేట్ కళాశాల ఉండగా, ఖమ్మం నగరంలో 5 ప్రైవేట్(రెహాన, ఇందిరాగాంధీ, వాణి, యూలైక్, అల్సనా) ఐటీఐ కళాశాలలున్నాయి. వీటిల్లో 1,540 సీట్లు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో ఐదు నుంచి ఏడు వరకు కోర్సులున్నాయి.
సంవత్సరం కోర్సులు..
కోర్సు కాలపరిమితి సంవత్సరం మాత్రమే, కొన్ని కోర్సులు రెండు సంవత్సరాలున్నాయి. చక్కగా నేర్చుకున్న విద్యార్థికి మంచి భవిష్యత్ అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయిన ప్రైవేట్ పరిశ్రమలోనైనా ఉద్యోగం ఖాయం. తన కాళ్లపైన తాను నిలబడి జీవించే నైపుణ్యాలు సంపాదిస్తాడు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, డ్రస్ మేకింగ్ వంటి కోర్సులున్నాయి. ఈ ట్రేడుల్లో సంవత్సరంపాటు శిక్షణ ఇస్తారు. తర్వాత పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు లభించి వృత్తి నైపుణ్యాలతో నిలదొక్కుకునేందుకు ప్రతిభే దోహదపడుతుంది. ఇటీవల కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్)పై విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వీరిలో ముగ్గురికి కలెక్టర్ ల్యాప్టాప్లు బహూకరించారు. 3నెలలపాటు టౌన్ ఫ్లానింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో శిక్షణ కల్పించారు.
132 సీట్లు భర్తీ
జిల్లాలో 9 కళాశాలల్లో 1,540 సీట్లు ఉండగా మొదటి ఫేజ్లో 132 మంది ప్రవేశాలు పొందగా 1,410 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండో, మూడో విడతలోనైనా పదో తరగతి పూర్తైన విద్యార్థులు ప్రవేశాలు పొందిన ఉజ్వల భవిష్యత్కు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాసరావు సూచించారు .
రాష్ట్రంలో ఖమ్మంలో మాత్రమే కోర్సు..
ఐఓటీ స్మార్ట్ అగ్రికల్చర్ ఐటీఐ కోర్సు రాష్ట్రంలో ఏ ఐటీఐ కళాశాలలో లేదు. ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం 28మంది విద్యార్థులు చేరారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పంట విత్తడం నుంచి మొదలు పెడితే పురుగుమందుల పిచికారీ, కలుపు నివారణ, పంట కోతల వరకు యంత్రాలను విరివిగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ డ్రోన్లు సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త రెక్కలు విప్పుతున్నాయి. ఈ కోర్సులో సెన్సార్, డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై నేర్చుకోనున్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని 28మందిలో 22మందిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి కింద రెండునెలల శిక్షణ కల్పించేందుకు ఎంపిక చేశారు. శిక్షణ అనంతరం వీరికి డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ టెక్నీషియన్ ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి. సోలార్ టెక్నిషియన్ కూడా ఈ సంవత్సరం కోర్సును ప్రవేశపెట్టారు. ఖమ్మంతో పాటు ఆలేరు, మహబూబ్నగర్ ఐటీఐ కళాశాలలో మాత్రమే అందుబాటులో ఉంది.