ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 15: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర విద్యార్థులు మొదటి రోజు తెలుగు సంస్కృతం పరీక్ష రాశారు. నిమిషం నిబంధన ఉందని అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించడంతో చాలా మంది విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
ప్రథమ సంవత్సర పరీక్షలకు ‘సీ’ సెట్ ప్రశ్రపత్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. డీఈసీ సభ్యులు, ఫ్లయింగ్ స్వాడ్స్ సభ్యులు కలిపి 23 కళాశాలలను, సిట్టింగ్ స్కాడ్స్ సభ్యులు మరో 10 కళాశాలలను తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. నగరంలోని న్యూవిజన్, టేకులపల్లిలోని శ్రీచైతన్య కళాశాలలను తనిఖీ చేశారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. రెగ్యులర్ విభాగంలో 18,586 మంది విద్యార్థులకు గాను 17,726 మంది హాజరయ్యారు. 860 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 16,023 మందికి గాను 15,473 మంది హాజరయ్యారు. 550 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 2,563 మంది విద్యార్థులకు గాను 2,253 మంది హాజరై 310 మంది గైర్హాజరయ్యారు. ఈ వివరాలను డీఐఈవో రవిబాబు వెల్లడించారు. సత్తుపల్లి, మధిర, ఖమ్మంలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్లు, డీఈసీ సభ్యులు, హై పవర్ కమిటి సభ్యులు తనిఖీ చేశారు.
భద్రాద్రి జిల్లాలో 35 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో 8,292 మంది, ఒకేషనల్ విభాగంలో 2,469 మంది కలిపి మొత్తం 10,761 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే జనరల్లో 7,852 మంది, ఒకేషనల్లో 2,082 మంది పరీక్షకు హాజరయ్యారు. జనరల్లో 440 మంది, ఒకేషనల్లో 381 మంది కలిపి మొత్తం 827 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ భద్రాద్రి జిల్లా నోడల్ ఆఫీసర్ సులోచనారాణి కొత్తగూడెంలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. bietelangana. cgg.gov.inలో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
గూగుల్ మ్యాప్లో తప్పుగా సెర్చ్ చేసి మరో ప్రాంతానికి వెళ్లిన ఓ విద్యార్థి.. తన కేంద్రానికి ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయాడు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురానికి చెందిన కొండా వినయ్ అనే విద్యార్థికి నగరంలోని ఎన్ఎస్పీ పాఠశాలలో పరీక్ష కేంద్రం పడింది. అతడు గూగుల్లో ఎన్నెస్పీ కెనాల్ సెంటర్ అని సెర్చ్ చేయడంతో గూగుల్ మ్యాప్ టేకులపల్లి వైపు చూపింది. దాని ఆధారంగా అటుగా వెళ్లిన ఆ విద్యార్థి.. తాను మరో ప్రాంతానికి చేరుకుంటున్నట్లు తెలుసుకున్నాడు. చివరికి గట్టయ్యసెంటర్లో ఉన్న ఎన్ఎస్పీ పాఠశాలే తన కేంద్రమని తెలుసుకొని తిరిగి వచ్చాడు. అప్పటికే సమయం 9:27 కావడంతో అతడిని అధికారులు అనుమతించలేదు.