ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 20: ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు ఇంటర్మీడియట్. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే స్టేజ్. ఇంటర్మీడియట్లో చదివిన గ్రూప్ ఆధారంగానే తర్వాత ఉన్నత చదువులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎంతో శ్రద్ధగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సోమవారం ప్రభుత్వం ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. సెన్స్ గ్రూప్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్ మొదలు కానున్నాయి. మార్చి 15 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్, 16 నుంచి సెకండియర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన సబ్జెక్ట్ల పరీక్షలు మార్చి 29న ముగుస్తాయి. ఇతర పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. పరీక్షల తేదీలు ప్రకటించడంతో ఒక్కసారిగా విద్యార్థుల్లో అలెర్ట్నెస్ వచ్చింది. అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. దీంతో ఎగ్జామ్ ఫీవర్ మొదలైనట్లు కనిపిస్తున్నది.
వార్షిక పరీక్షలకు కౌంట్డౌన్ మొదలైంది. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, సంక్షేమ కళాశాలలు మొత్తం కలిపి 218 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి ఆయా కళాశాలల్లో 26,745 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరింతా వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరిన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండానే అడ్మిషన్లు ఇచ్చింది. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించిది. అధ్యాపకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నది. ఒప్పంద అధ్యాపకుల వేతనాలను ఠంచనుగా విడుదల చేస్తున్నది. కళాశాలలో సీసీ కెమెరాలు అమర్చి పర్యవేక్షణ పెంచింది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగింది. ప్రస్తుతం అధ్యాపకులు ప్రభుత్వ కళాశాల విద్యార్థులను ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డీఐఈవో రవిబాబు, బోర్డు అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అనేకసార్లు సమీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు.
సైన్స్ గ్రూప్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభంకానున్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ విద్యాధికారులు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్న ప్రయోగశాలలనే ప్రాక్టికల్స్ నిర్వహణకు ఎంపిక చేస్తున్నారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ పద్ధతి అమలవుతున్నది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. సిలబస్ సత్వరం పూర్తి చేస్తున్నాం. విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పరీక్షలు పెడుతున్నాం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వారిలో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు కౌన్సిలర్స్తో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకూ ఈ తరహా కౌన్సిలింగ్ ఇస్తున్నాం.
– రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం