సోల్జర్ వీరబాబు ప్రయాణం ఇదీ..
సైనికుడిగా 17 ఏళ్ల పాటు సేవలు
‘కార్గిల్ వార్’ త్యాగాల స్ఫూర్తిగా సైన్యంలోకి..
ఇటీవల రిటైర్మెంట్.. ఎస్సై కొలువుకు ప్రిపరేషన్
ముదిగొండ, జూలై 3: కార్గిల్ వార్ తనను కదిలించింది.. సైనికుల త్యాగాలు తనలో స్ఫూర్తిని నింపాయి.. దేశ భద్రతలో తాను భాగస్వామిని అవ్వాలనుకున్నాడు.. సైనికుడిగా మారి సేవలదించాలనుకుని కొలువు సాధించాడు. 17 ఏళ్ల పా టు ఆర్మీలో సేవలు అందించాడు. ఇటీవల రిటైర్మెంట్ తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు. ఆయనే ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన బెందు వీరబాబు. తనకు చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలనే కోరిక బలంగా ఉండేది. చిన్నతనంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ ఆయన్నెంతో ప్రభావితం చేసింది. చిన్ననాటి నుంచే ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాడు. కిలోమీటర్ల మేర పరుగెత్తడం అలవాటు చేసుకున్నాడు.
2005లో డిగ్రీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. కొలువు వచ్చే అవకాశం ఉన్నా అటు వైపు దృష్టి సారించలేదు వీరబాబు. ఎలాగైనా సైన్యంలో చేరాలనుకున్నాడు. అందుకు శారీరక దారుఢ్యం అవసరమని గుర్తించి నిత్యం వ్యాయామం చేసేవాడు. సైన్యంలో చేరి దేశ భద్రతలో భాగస్వామిని అవుతానని తల్లిదండ్రులు బసవయ్య, కౌసల్య ను ఒప్పించాడు. ఇదే సంవత్సరంలో ఆర్మీ సెలక్షన్స్కు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు నెలలు కఠోర సాధన చేసి ఖమ్మంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నాడు. పరుగు పందెంలో నెగ్గాడు. తర్వాత మెడికల్, రాత పరీక్షలనూ అధిగమించాడు. వీరబాబు కంప్యూటర్ సైన్స్ చదవడంతో ఆర్మీ అధికారులు ఆయన్ను కమ్యూనికేషన్ విభాగం లో పోస్టింగ్ ఇచ్చారు. సైన్యంలో చేరిన తర్వాత మొదట్లో వీరబాబుకు హిందీ మాట్లాడడం కష్టమైంది. మెల్లగా భాష నేర్చుకుని తర్వాత ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్ విభాగాల్లో పనిచేశాడు. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతాలైన కాశ్మీర్, అస్సోం వంటి ప్రాంతాల్లోని బేస్ క్యాంపుల్లో పనిచేశాడు. జమ్మూ కాశ్మీర్లో పని చేసిన అనుభవం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందంటాడు వీరబాబు. మంచు కొండల నుంచి సుదూరంలో పాకిస్తాన్ బార్డర్ను చూడడం ఉద్విగ్నతను కలిగించిందంటాడు.
కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నా..
సైన్ంయలో చేరడమంటేనే త్యాగం. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులను దూరంగా విడిచి ఉండడమంటే మాటలు కాదు. అది అనుభవిస్తేనే తప్ప తెలియని వ్యథ. అలాంటి బాధనే 17 ఏళ్లు అనుభవించారు వీరబాబు. సైన్యంలో పనిచేస్తున్న తొలినాళ్లలో బంధువుల అమ్మాయి సూర్యకళను వివాహం చేసుకున్నారు వీరబాబు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వీక్ష, చైత్ర. ఎప్పుడో పండగలు పబ్బాలు, సెలవులకు తప్పితే మిగతా రోజుల్లో తప్పకుండా విధులకు హాజరు కావాల్సిందే. దేశ సరిహద్దులో ఎలాంటి అలజడి సంభవించినా, కాల్పులు జరిగినా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యేవారని, తాను ఫోన్లో మాట్లాడేంతవరకు వారికి ప్రశాంతత ఉండేది కాదని వీరబాబు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలతో అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడి సంతృప్తి చెందేవాడినన్నాడు. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో భార్య సహకారం మరువలేనిదంటున్నారు. 17 ఏళ్లు పనిచేసి మూడు నెలల క్రితం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు వీరబాబు. ప్రస్తుతం ఎస్సై కొలువు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్మీ కోటాలో ఉద్యోగం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్లు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపాయంటున్నారు.