ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 11: ఇంటర్మీడియట్ పరీక్షలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 15 నుంచి జరుగనున్న పరీక్షలకు అధికారులు జిల్లావ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. తరగతి గదిలో వెలుతురు ఉండి, విద్యాసంస్థలో నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థికి మరో విద్యార్థికి దూరం ఉండేలా చూడాలి. ఈ కారణంతోనే కేంద్రాల సంఖ్య పెంచాల్సి వచ్చింది. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు జూనియర్ కళాశాలలను మాత్రమే బోర్డు ఆమోదించేది. కానీ ఇప్పుడు నిబంధనలను సడలించి ప్రభుత్వ స్కూళ్లనూ ఎంపిక చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
జంబ్లింగ్ పద్ధతిలో..
ఇంటర్మీడియట్ అధికారులు జంబ్లింగ్ పద్ధతిలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు ఉంటే వాటిని అలాగే కొనసాగించి సీసీ కెమెరాలు లేని విద్యాసంస్థల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 124 జూనియర్ కళాశాలలు ఉండగా వీటిలో 54 జూనియర్ కళాశాలలు ఎంపికయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఖమ్మం నగరంలోని రిక్కాబజార్, శాంతినగర్, ఎన్నెఎస్పీ క్యాంప్, రాజేంద్రనగర్ పాఠశాల, కూసుమంచి జడ్పీ హైస్కూల్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థల్లో శ్రీచైతన్య ఇంటర్నేషనల్ స్కూల్ (మమత రోడ్), శ్రీచైతన్య స్కూల్ (ఎన్టీఆర్ సర్కిల్), మాంట్ఫోర్ట్ స్కూల్ ఉన్నాయి. వీటితో పాటు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలను కేంద్రాలుగా ఎంపిక చేశారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులిలా..
జిల్లావ్యాప్తంగా రెగ్యులర్, ఒకేషనల్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 35,857 మంది ఉన్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం రెగ్యులర్ చదువుతున్న వారు 15,444 మంది. ఒకేషనల్ చదువుతున్నవారు. 2,446 మంది ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ చదువుతున్నవారు 15,650 మంది, ఒకేషనల్ చదువుతున్నవారు 2,317 మంది. పరీక్షల పర్యవేక్షణకు ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ(డెక్)ని నియమించింది. కమిటీ కన్వీనర్గా డీఐఈవో వ్యవహరిస్తారు. కమిటీలో ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఒక జూనియర్ లెక్చరర్ సభ్యులుగా ఉంటారు. వీరు ప్రాక్టికల్స్తో పాటు పరీక్షలను పర్యవేక్షించనున్నారు.
కేంద్రాలను గుర్తించాం..
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు బోర్డు మార్గదర్శకాల ప్రకారం కేంద్రాలను ఎంపిక చేశాం. పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా వసతి ఉండేలా జాగ్రత్త వహిస్తున్నాం. పరీక్ష రాసేందుకు అనువుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను కేంద్రాలుగా ఎంపిక చేశాం.
– రవిబాబు, డీఐఈవో, ఖమ్మం