జూలూరుపాడు, డిసెంబర్ 27 : మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కాకర్ల, జూలూరుపాడు, పడమట నర్సాపురం, పాపకొల్లు గ్రామాల్లో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ-గ్రేడ్ ధాన్యం ధర రూ.2060, సీ-గ్రేడ్ రూ.2040 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు మనుబోలు తిరువెంగళరాజు, జవహర్రెడ్డి, రాము, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్రావు, సహకార సంఘం సీఈవో రమణారెడ్డి, సిబ్బంది సునీత మానిటరింగ్ అధికారి కిశోర్, ఏఈవో గౌస్, బీఆర్ఎస్ నాయకులు యల్లంకి చిన్న నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.
‘దళారులను నమ్మి మోసపోవద్దు’ సారయ్య
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొత్తగూడెం విద్యానగర్కాలనీ ప్రాథమిక సహకార సంఘం సీఈవో సారయ్య అన్నారు. మండలంలోని పెనగడపలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 5,897 ధాన్యం బస్తాలను 39మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. రైతుల ఖాతాల్లో రూ.53 లక్షల 36వేల 632 నగదును జమ చేసినట్లు చెప్పారు. మొత్తం 8లారీల లోడ్లను మిల్లర్లకు తరలించినట్లు చెప్పారు. చుంచుపల్లి కొనుగోలు కేంద్రంలో మొత్తం 39మంది రైతుల నుంచి 5,897 బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.53,36,632 రైతుల ఖాతాల్లో జమ చేశామని, మొత్తం 8 లారీల ద్వారా మిల్లర్లకు పంపించినట్లు చెప్పారు.