పాల్వంచ, మార్చి 12 : అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యం సీసాలో పురుగులమందు కలిపి భర్తను హతమోందించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటచెరువుకు చెందిన పుట్టల నరేశ్ S/o రాములు(లేట్) తేది 1.02.2025 న మృతి చెందాడు. వ్యక్తి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పుట్టల చుక్కమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పేటచేరువు స్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి, పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు.
కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు గద్దల సాంబశివరావు, తాటి నరేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతుడు నరేశ్ భార్య రజితకు, ఈమె బావ గద్దల సాంబశివరావుకు మధ్య అక్రమ సంబంధం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో తన భర్త పుట్టల నరేశ్ అడ్డుతోలగించుకోవాలని రజిత, సాంబశివరావు ఇద్దరూ కలిసి పథకం రచించారు. స్నేహితుడు తాటి నరేశ్ సహాయంతో ముందస్తు పథకం ప్రకారం పుట్టల నరేశ్ కు మద్యం బాటిల్ లో పురుగుల మందు కలిపి ఇచ్చారు. ఆ మధ్య తాగిన రజిత భర్త అస్వస్తకు గురై చనిపోయాడు.
అంతేకాకుండా పుట్టల నరేశ్ దినసరి కార్యక్రమంలో అదే మద్యంను పెటచెరువుకు చెందిన బొజ్జా వెంకటేశ్వర్లు తాగగా అతని ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు గద్దల సాంబశివరావు, తాటి నరేశ్, పుట్టల రజితను పోలీసులకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.