కొత్తగూడెం క్రైం, మే 22 : మావోయిస్టుల భారీ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ భద్రతా బలగాల సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. భారీగా పేలుడు పదార్థాలు, నాలుగు వాహనాలతోపాటు పది మంది కొరియర్లు, మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న కొత్తగూడెంలోని ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. దుమ్ముగూడెం మండలం ములకనపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో మండల పోలీసులు, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్, స్పెషల్ పార్టీ భద్రతా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పది మంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ విచారణలో సదరు వ్యక్తులు మావోయిస్టు పార్టీ కొరియర్లుగా వ్యవహరిస్తున్న వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన జన్ను కోటి, తాళ్లపల్లి ఆరోగ్యం, నర్సంపేట మండలానికి చెందిన ఆరెపల్లి శ్రీకాంత్, చెన్నారావుపేట మండలానికి చెందిన మేకల రాజు, చిలివేరు రమేశ్, మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఆవుపల్లికి చెందిన ముసికి రమేశ్, ముసికి సురేశ్, బాడిస లాలు, సోడి మహేశ్, మడివి చేతుగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 90 కార్డెక్స్ వైర్ బండిళ్లు, 500 డిటోనేటర్లు, 600 స్లర్రీ స్టిక్స్, టీఎస్ 24టీ 8640 నెంబరు గల బొలెరో, ఏపీ 20 టీఏ 7313 నెంబరు గల ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వినీత్ జి వెల్లడించారు.
సదరు ఐదుగురు కొరియర్లు నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల ఆదేశానుసారం పోలీసు క్యాంపులు, కూంబింగ్ నిర్వహించే భద్రతా బలగాలపై దాడులు నిర్వహించేందుకు అవసరమైన ల్యాండ్మైన్లు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజీవ్ డివైస్(ఐఈడీ)లు, రాకెట్ లాంచర్ల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను బొలేరో వాహనంలో తీసుకొని దుమ్ముగూడెం మండలానికి రావడంతో మిగతా ఐదుగురు మిలీషియా సభ్యులు ములకనపల్లి సమీప ప్రాంతంలో ట్రాక్టర్లో లోడు చేస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. మావోయిస్టు కొరియర్లకు పేలుడు పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తులు, లైసెన్స్డ్ సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ ఎన్. వెంకటేశ్, దుమ్ముగూడెం సీఐ దోమల రమేశ్, ఎస్సై రెడ్డెం నర్సిరెడ్డి, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.