ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 20 : ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్లో ప్రకటించిన విధంగా ఎన్నికల ప్రక్రియకు అవసరమైన జాబితాలను రూపొందించింది. దీంతో జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల స్థాయిలో ఎన్నికల నిర్వహణపై ఎంఈవోలు హెచ్ఎంలకు సూచనలు చేశారు. తరగతులవారీగా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల జాబితాతోపాటు వారి తల్లిదండ్రుల జాబితాను రూపొందించారు. ఇందుకోసం పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు.
నోటీసు బోర్డుపై జాబితాలు
డీఈవో ప్రకటించిన నోటిఫికేషన్ షెడ్యూల్కు అనుగుణంగా శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఎన్నికకు సంబంధించిన అర్హతలు, నిబంధనలను స్పష్టంగా పేర్కొంటూ అందరికి తెలిసేలా నోటీసు బోర్డుపై పొందుపర్చారు. దీంతోపాటు శనివారం ఉదయం హెచ్ఎంలు పాఠశాల స్థాయినిబట్టి తోటి ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి.. విద్యార్థుల సంఖ్య(చైల్డ్ ఇన్ఫో ఆధారంగా)ను పోల్చి చూశారు. అనంతరం హెచ్ఎంలు నోటీసు బోర్డుపై ఓటరు జాబితాను ప్రదర్శించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో జిల్లావ్యాప్తంగా ఉన్న 1,300 పాఠశాలల్లో ఓటరు జాబితాను ప్రదర్శించారు.
ఎంఈవోలకు సూచనలు చేసిన డీఈవో
ఎస్ఎంసీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో డీఈవో సోమశేఖర శర్మ శనివారం ఆన్లైన్ సమావేశంలో రివ్యూ నిర్వహించారు. ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులు, పర్యవేక్షించాల్సిన విధానం, హెచ్ఎంలకు చేయాల్సిన మార్గదర్శకాలపై సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో హెచ్ఎం నుంచి వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. చైల్డ్ ఇన్ఫోలో లేకుండా పాఠశాలలో ఉండే విద్యార్థులను ఓటరు జాబితాలో ఉంచాలా.. లేదా.. అనే సందేహాలను కొందరు ఎంఈవోల దృష్టికి తెచ్చారు. వీటన్నింటిపై సమావేశంలో చర్చించి అభ్యంతరాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేయాలని స్పష్టం చేశారు.