ఉద్యోగార్థులకు, అభాగ్యులకు ‘హరిప్రియ’ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నది. ఇల్లెందు కేంద్రంగా ఎమ్మెల్యే దంపతులు హరిప్రియ, హరిసింగ్నాయక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వందలాది మంది యువతీ, యువకులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు భోజన వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయినవారు ఇక్కడ ఈవెంట్స్కు శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా, గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఫౌండేషన్ ద్వారా యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
– టేకులపల్లి, డిసెంబర్10
త్వరలో గ్రూప్-4కు శిక్షణ..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఫౌండేషన్ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్, వసతి సైతం కల్పిస్తున్నది. గ్రూప్-4 మాత్రమే కాక మున్ముందు గ్రూప్-2, 3 కొలువులకూ ఉచితంగా శిక్షణ ఇస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
టేకులపల్లి, డిసెంబర్10: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం యువత కల. కానీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఆర్థిక స్తోమత సరిపోదు. పేదరికం వారిని గడప దాటనివ్వదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువ. అలాంటి యువతను చేరదీసి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నది హరిప్రియ ఫౌండేషన్. ఇల్లెందు కేంద్రంగా ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్ నాయక్ దంపతులు మూడేళ్ల క్రితం ఫౌండేషన్ ఏర్పాటు చేసి వందలాది మంది యువతీ యువకులకు అండగా నిలుస్తున్నారు. నిపుణులతో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ గ్రూప్స్, పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ విడుదలైతే యువత హైదరాబాద్కు వెళ్లేవారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి వ్యయప్రయాసల కోర్చి శిక్షణ తీసుకునేవారు. ఈ కష్టనష్టాలను అర్థం చేసుకుని, యువతకు అండగా నిలవాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారు ఈవెంట్స్కు శిక్షణ పొందుతున్నారు. తర్వాత మెయిన్స్కు సిద్ధమవుతారు.
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ క్వాలిఫై..
హరిప్రియ ఫౌండేషన్ పరిధిలో ప్రస్తుతం ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి 100 మంది అభ్యర్థులు పోలీస్ కొలువులకు సిద్ధమవుతున్నారు. మూడు నెలలు శిక్షణాకాలం. సబ్జెక్ట్ల వారీగా పోటీ పరీక్షల శిక్షణా రంగంలో అపార అనుభవం ఉన్న నిపుణులు పాఠాలు బోధిస్తున్నారు. ఫౌండేషన్ ఉచిత వసతి, భోజనం కల్పిస్తున్నది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు 39 మంది యువకులు, 22 మంది యువతులు క్వాలిఫై అయ్యారు. అలాగే ఎస్సై ప్రిలిమనరీ పరీక్షకు 100 మంది హాజరైతే 74 మంది క్వాలీఫై అయ్యారు.
అభాగ్యులకు అండగా..
ఫౌండేషన్ ఒకవైపు ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తూనే మరోవైపు అభాగ్యులకు అండగా నిలుస్తున్నది. వానకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఫౌండేషన్ రంగంలోకి దిగి వరద బాధితులకు అండగా నిలిచింది. పునరావాస కేంద్రాలకు వెళ్లి వారికి నిత్యావసర సరుకులు అందజేసింది. అలాగే కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. మృతుల కుటుంబాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేస్తున్నది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు శిక్షణ ఇస్తున్నది. శిక్షణ తర్వాత కుట్టుమిషన్లు అందజేస్తున్నది.
ఫౌండేషన్ చిరునామా
జేకే కాలనీ ఏరియా, ఆర్అండ్ఆర్ కాలనీ, ఇల్లెందు పట్టణం,
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 86883 74698, 96764 61901
నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని..
ఏజెన్సీ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. అలాగే నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాలకు మాకు వీలైనంత సాయం చేస్తున్నాం. ఫౌండేషన్లో శిక్షణ పొంది ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు క్వాలిఫై కావడం సంతోషాన్నిచ్చింది. త్వరలో గ్రూప్-4కు శిక్షణ ఇస్తాం. నిరుపేదలను ఆదుకునేందుకు మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.
– ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ
ఎస్సై ప్రిలిమినరీ క్వాలీఫై అయ్యాను..
మేం ఇద్దరం అన్నదమ్ము లం. నేను రెండో వాడిని. నాన్న చనిపోయారు. అమ్మ మమ్మల్ని చూసుకుంటున్నది. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ కొలువు సాధించాలని కోరిక. కానీ వేలకు వేలు డబ్బు చెల్లించి శిక్షణ తీసుకునే స్తోమత లేదు. హరిప్రియ ఫౌండేషన్ ఉచితంగా శిక్షణ ఇస్తున్నదని తెలిసి దరఖాస్తు చేసుకున్నా. శిబిరంలో నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. నేను ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యాను.
– ఎర్రమళ్ల దివాకర్, ఉద్యోగార్థి, ఇల్లెందు
నాణ్యమైన శిక్షణ..
మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నేను రెండో అమ్మాయిని. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాక రెండింటికీ ఐప్లె చేశాను. హైదరాబాద్కు వెళ్లి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకునే స్తోమత లేదు. హరిప్రియ ఫౌండేషన్ ఉచితంగా కోచింగ్ ఇస్తున్నదని తెలుసుకుని శిక్షణ తీసుకున్నా. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యాను. ఫౌండేషన్ ఉద్యోగార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నది.
– ప్రణయ, సుదిమళ్ల, ఇల్లెందు మండలం