కూసుమంచి, ఆగస్టు 17: తెలంగాణలోనే చేతి వృత్తిదారులకు చేయూత లభిస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో మరుగున పడిన కుల, చేతి వృత్తులను ప్రోత్సహించి ఆ వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని 300 మంది బీసీ, కుల, చేతి వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష చెక్కులను కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. వృత్తిదారుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. బీసీ లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున రుణాలు అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రతి నెలా 300 మందికి ఈ రుణాల చెక్కులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. డీబీసీడబ్ల్యూవో జ్యోతి, జడ్పీ వైస్ చైర్పర్సన్ ధనలక్ష్మి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, ఉమ, మంగీలాల్, వరప్రసాద్, ఇంటూరి శేఖర్, నాగుబండి శ్రీనివాస్, శాంత, లీలాప్రసాద్, వీరయ్య, వేణుగోపాల్, బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న పాల్గొన్నారు.