మామిళ్లగూడెం/కొత్తగూడెం టౌన్, మే 18 : వచ్చే నెల 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులకు సూచించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు చేపడుతున్న ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష నిర్వహణకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకూ ఒక రీజినల్ కోఆర్డినేటర్ను నియమించామని, అదనపు కలెక్టర్, రీజినల్ కోఆర్డినేటర్లు జాయింట్ కస్టోడియన్గా ఉంటారని, వీరికి పోలీసు నోడల్ అధికారి సహకరిస్తారని అన్నారు. విద్యార్థులకు బయోమెట్రిక్ నిర్వహణ ఉంటుందని అన్నారు. బయోమెట్రిక్ తీసుకునే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. రీజినల్ కోఆర్డినేటర్లు, సెంటర్ అబ్జర్వర్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, పోలీస్ నోడల్ అధికారులకు ఈ నెల 22న హైదరాబాద్లో శిక్షణ ఇస్తామన్నారు.
కేంద్రాలను సిద్ధం చేశాం : ఖమ్మం కలెక్టర్
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో 18,600 మంది అభ్యర్థుల కోసం 52 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేశామని అన్నారు. అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్నాయక్, జిల్లా అధికారులు మాలతి, అఫ్రిన్ సిద్ధిఖీ, సోమశేఖర శర్మ, జాన్బాబు, రాజ్కుమార్, బాబూరావు, శ్రీనివాస్, అరుణ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లాలో 21 కేంద్రాలు : కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 8,875 మంది అభ్యర్థుల కోసం 21 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులను ప్రధాన గేటు ద్వారా మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి పంపిస్తామన్నారు. అనంతరం టీజీపీఎస్సీ రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ జగన్మోహన్రాజు, కలెక్టర్ ప్రియాంక కలిసి ఐడీవోసీలోని స్ట్రాంగ్రూమ్ను పరిశీలించారు. డీఎస్పీ రెహమాన్, జిల్లా పరిపాలనాధికారి గన్యా పాల్గొన్నారు.