వర్షం కురుస్తున్నకొద్దీ వరద ఉధృతి పెరుగుతున్నది. జలమంతా నిలవకుండా దిగువకు వృథాగా పోతున్నది. ఆ నీటికి అడ్డుకట్ట వేయాలి.. చెక్డ్యాం నిర్మాణంతో పరిష్కారం చూపాలి.. చుక్కచుక్కనూ ఒడిసిపట్టి.. భూగర్భ జలాలను పెంపొందింపజేసి సాగుకు వినియోగించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అందుకనుగుణంగా మున్నేరు, కట్టలేరు నదులపై రూ.11.02కోట్లతో రెండు చెక్డ్యాంలు నిర్మించేందుకు సర్కారు పూనుకున్నది. రెండు పంటలు పండించుకునే సంతోషాన్ని రైతుల మోములో నింపింది.
మధిర, ఆగస్టు 27 : రైతు ప్రయోజనాలతోపాటు సాగునీటి రంగాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్న ప్రభుత్వం.. సాగునీటికి రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ జలాలు పెంపొందించేందుకు వాగులు, నదులపై చెక్డ్యాంలు నిర్మించేందుకు పూనుకున్నది. ఖర్చుకు వెనుకాడకుండా ప్రజాప్రతినిధుల సూచన మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపించిందే తడవుగా చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతోపాటు జీవోలు జారీ చేసింది. చెక్డ్యాంల నిర్మాణంతో నీటి నిల్వతోపాటు భూగర్భ జలాలు పెంపొంది ఆయకట్టు రైతులు పుష్కలంగా పంటలు పండించుకునే అవకాశం కల్పించినట్లవుతుంది.
సాగుకు ఢోకా లేకుండా&
చెక్డ్యాంల నిర్మాణం చేపడితే మధిర నియోజకవర్గంలోని సిరిపురం లిఫ్ట్, రాయన్నపేట లిఫ్ట్కు నీటి కొరత లేకుండా ఉంటుందని భావించి చెక్డ్యాంలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెక్డ్యాంల నిర్మాణాల వల్ల లిఫ్ట్లతోపాటు మున్నేరు పక్కన ఉన్న వ్యవసాయ భూములకు నీటి కొరత లేకుండా మాగాణి, మెట్ట పంటలు పండించుకునే అవకాశాన్ని కల్పించింది. వీటితోపాటు బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండడంతో ఈ ప్రాంత రైతాంగం ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఫేస్లో మధిర మండలం చిలుకూరు, తొర్లపాడు, ఎర్రుపాలెం మండలం శఖునవీడులో ఇప్పటికే చెక్డ్యాం నిర్మాణాలు పూర్తి చేసుకొని రైతులకు ప్రయోజనకరంగా మారాయి.
మున్నేరు, కట్టలేరు నదులపై చెక్డ్యాంలు
జిల్లాలోని మధిర నియోజకవర్గంలో వైరా మున్నేరు నదిపై బోనకల్లు మండలం రాయన్నపేట సమీపంలో రూ.4.60కోట్లతో, ఎర్రుపాలెం మండలం కట్టలేరు నదిపై పెగళ్లపాడు వద్ద రూ.6.60కోట్లతో చెక్డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం ఈనెల 8న నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసిన విషయం విదితమే. వర్షాకాలంలో ఎర్రుపాలెం మండలంలోని కట్టలేరు, బోనకల్లు మండలంలోని వైరా మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తాయి. వాటి సామర్థ్యాన్ని మించిపోవడంతో వరద నీరంతా పొరుగు రాష్ట్రంలో ఉన్న కృష్ణా నదిలో కలిసి వృధా అవుతున్నది. వర్షాలు తగ్గిన తర్వాత నీటి ప్రవాహం తగ్గి.. ఆయా నదుల్లో నీటి నిల్వ లేకపోవడంతో ఆయకట్టు రైతాంగానికి సాగునీరందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వరద నీటికి అడ్డు కట్టలు వేయడంతోపాటు చుక్కనీరు కూడా వృధాగా పోకుండా చెక్డ్యాంలు నిర్మించి ఆయకట్టుకు నీరందించేందుకు శ్రీకారం చుట్టింది. ఆయా చెక్డ్యాంల నిర్మాణం వల్ల సుమారు 8 అడుగుల మేర నీరు నిలిచి ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.
కృతజ్ఞతలు తెలిపిన జడ్పీ చైర్మన్ కమల్రాజు
చెక్డ్యాం నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేసినందుకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు.. సీఎం కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీ నామా నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు చెక్డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.