తన గర్భంలో నవ మాసాలపాటు పెరిగి, భూమ్మీద పడిన బిడ్డను చూడగానే ఏ తల్లయినా మురిసిపోతుంది… ఆ తల్లి మాత్రం – మనసులోనే మూగగా రోదించింది..!
తన పసి బిడ్డ కాళ్లూ చేతులూ ఆడిస్తూ, బోసి నవ్వులు కురిపిస్తుంటే.. ఏ తల్లయినా పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుంది.. ఆ తల్లి మాత్రం
– గుండె పగిలేలా రోదిస్తున్నది..!!
ఎందుకంటే.. తన మురిపెం ఇంకెన్ని రోజులో ఉండదేమోనని, తన ఆనందం అంతలోనే ఆవిరవుతుందేమోనని ఆమె భయం. తన బిడ్డకు అప్పుడే ఆయుష్షు తీరుతుందేమోనని వణుకు.
సత్తుపల్లి, నవంబర్ 23: సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన రేపాని పూర్ణచందర్రావు-లక్ష్మీతిరుపతమ్మ దంపతుల రెండో కుమార్తె పేరు కుందనికశ్రీ. ప్రస్తుతం ఏడు నెలలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పాపకు కాలేయం (లివర్) దెబ్బతిన్నది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే దీనిని వైద్యులు గుర్తించి తల్లిదండ్రులతో చెప్పారు. వారి నెత్తిన పిడుగు పడినట్లయింది. పాప పుట్టిన తర్వాత, త్వరగా ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టమని చెప్పడంతో ఆ దంపతులు తల్లడిల్లారు. దొరికిన చోటల్లా అప్పులు చేశారు. మనసున్న మారాజులు కొందరు ఆర్థిక సాయం చేశారు. అలా, పోగైన రూ.6లక్షలతో విజయవాడలోని బ్లోసమ్స్ ఆసుపత్రిలో పాపకు 40 రోజుల వయస్సులో ఆపరేషన్ చేయించారు. ప్చ్.. ఆపరేషన్ ఫెయిలయింది.
పాప పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. “ప్రతి 20వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధి వస్తుంది. మరోసారి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాల్సిందే. లేదంటే.. పాప ప్రాణాలు నిలవడం కష్టం” అని డాక్టర్లు చెప్పారు. “నా కాలేయం ఇవ్వండి.. నా బిడ్డను బతికించండి” అని ఆ తల్లి వేడుకుంది. డాక్టర్లు సరేనన్నారు. కానీ, ఆపరేషన్, మందులు, ఇతరత్రా అవసరాలకు మొత్తం రూ.22లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపారు. అప్పటికే అప్పులపాలైన ఆ దంపతులకు.. ఇంత పెద్ద మొత్తం భరించడం అసాధ్యంగా మారింది. “పాప వైద్యానికి ఇప్పటికే నెలకు రూ.10వేలు ఖర్చవుతున్నది.
ఇదే భరించలేకపోతున్నం. అన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేది..? మా బిడ్డను ఎట్లా బతికించుకునేది..?” అంటూ ఆ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. దాతలు ముందుకొచ్చి తలా ఒక చేయి వేసి తమ బిడ్డ ప్రాణం నిలపాలంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు. మానవతామూర్తులు 97011 23073 నంబర్లో (పాప తండ్రి పూర్ణచందర్రావుది) సంప్రదించాలని, పాపకు ప్రాణం పోయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న ఆర్టీసీ సత్తుపల్లి టీఎంయూ నాయకులు సాధు సుధాకర్, యనమాల నాగరాజు స్పందించారు. తమ వంతు సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు.