ఏటూరునాగారం, అక్టోబర్ 18 : ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొమురంభీం స్టేడియంలో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే క్రీడల కోసం ఉట్నూరు, భద్రాచలం, మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నుంచి 1,464మంది క్రీడాకారులు, 168మంది ఫిజికల్ డైరెక్టరు, పీఈటీలతో ప్రత్యక్షంగా మరో 350మంది అధికారులు, ఉపాధ్యాయులు, వర్కర్లు పాల్గొంటున్నారు. ముఖ్యఅతిథిగా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ హాజరై కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం, ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పీవో అంకిత్, వరుణ్రెడ్డి, గౌతం పొట్రు, ఏఎస్పీ అశోక్ కుమార్లతో కలిసి వేదికపై శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శలు ఆకట్టుకున్నాయి.
క్రీడల సందర్భంగా పావురాలను ఎగురవేస్తున్న క్రిస్టినా జెడ్ చొంగ్తూ, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు
ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు
ఈ క్రీడల్లో ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కో జోన్ నుంచి ఒక్కో క్రీడలో అండర్-14, 17 సంవత్సరాల బాలబాలికలు రెండేసి జట్లుగా పాల్గొంటుండగా జోన్-1 భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు చెందిన బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ క్రీడల్లో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టెన్నికాయిట్, అర్చరీ, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ పోటీల్లో క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ మాట్లాడుతూ.. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో సక్సెస్ అవుతారని అన్నారు. తొలిరోజు భద్రాచలం జట్లు వాలీబాల్ పోటీల్లో ఏటూరునాగారంతో పోటిపడింది.