ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 29: ఆటలు కూడా విద్యార్థుల చదువులో భాగమేనని కేఎంసీ మేయర్ పునుకోల్లు నీరజ పేర్కొన్నారు. నగరంలోని విన్ఫీల్డ్ పాఠశాలలో గురువారం జరిగిన వార్షిక క్రీడా సంబురాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో మెరుగ్గా ఉండాలంటే క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. అన్ని రకాల ఆటల్లోనూ ప్రావీణ్యం పొందాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. పోటీతత్వం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
గతంలో ఉండే ఆటలను ఇప్పుడు స్కూళ్లలో ఆడించడం లేదని, కార్పొరేట్ విద్య అనుకుంటూ తల్లిదండ్రులు కూడా ఆటలవైపు పిల్లలను ప్రాత్సహించడం లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాఠశాల నిర్వాహకులు మూడు రోజులపాటు క్రీడా సంబురాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చదువు వల్ల జ్ఞానం, ఆటల వల్ల క్రమశిక్షణ అలవడుతాయని వివరించారు. ఆటలు ఆడడం ద్వారా మనస్సు ఉల్లాసంగా ఉంటుందన్నారు.
పాఠశాల స్థాపించిన అతి తక్కువకాలంలో మంచిపేరు సాధించుకున్నారని అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్పొరేటర్లు లక్ష్మీనాగేశ్వరరావు, కే.వలరాజు, పాఠశాల డైరెక్టర్లు గద్దె పుల్లారావు, మన్నె కిశోర్కుమార్, పోలవరపు శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.