మణుగూరు టౌన్, మే 29 : ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ మోసపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేన్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు.
మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు కూడా వినియోగించుకోవడం చేతకాని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు విషయంలో రైతులను అన్ని విధాల మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన కార్యకర్తలకు బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.