ఖమ్మం, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి సాగయ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయంపై ప్రభావం తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో ఎల్నినో ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఆకాశంలో మేఘాలు ఏర్పడినా వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. రైతులు వర్షాలను మాత్రమే కాకుండా భవిష్యత్లో నీటి లభ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా నీటి ఆధారిత పంటలను సాగు చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, భూగర్భ జలాల లభ్యతపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
భూగర్భ జలాలు 6.5 నుంచి 8 అడుగుల మేర తగ్గాయని, గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ప్రస్తుతానికి భూర్భ జలమట్టాలు బాగా తగ్గాయన్నారు. బోర్లు ఉన్నాయనే కారణంతో వ్యవసాయం చేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారని, అయితే రానున్న నెలన్నర రోజుల్లో భూగర్భ జలాల లభ్యత మరింత తగ్గే అవకాశం ఉందని, ఈ పరిస్థితిని రైతులు ముందుగానే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పొద్దుతిరుగుడు, పప్పుధాన్యాలు, కంది, పెసర తదితర తక్కువ నీరు అవసరం అయ్యే పంట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని 50 శాతం రాయితీతో ఇస్తున్నామని తెలిపారు.
రైతులు ఎవరూ వరి సాగు చేయొద్దని, ఆ పంటకు అవసరమయ్యే జలాలు లేవని పేర్కొన్నారు. జిల్లాలో వర్షపు నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వర్షాకాలం పూర్తయిన తర్వాతే కరువు పరిస్థితులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. ఇరిగేషన్ సీఈ వాసంతి, ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.